తూర్పు గోదావరిలో వింత జంతువు.. భయాందోళనలో స్థానికులు.. అధికారులు ఏం తేల్చారంటే...
తూర్పు గోదావరి జిల్లాలో వింత జంతువు కలకలం రేపుతోంది. జిల్లాలోని ఆలమూరు, కపిలేశ్వరపురం,నవాబుపేట,పెనికేరు గ్రామాల్లో ఈ వింత జంతువు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల నవాబుపేటలో గోపు రాముడు అనే రైతుకు చెందిన లేగ దూడపై వింత జంతువు దాడి చేసి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు.
కొద్ది రోజుల క్రితం జొన్నాడ,నవాబుపేట,పెనికేరు గ్రామాల్లోనూ పదుల సంఖ్యలో పశువులను వింత జంతువు చంపిందని అక్కడివారు చెబుతున్నారు.తాజాగా ఆలమూరు మండలం పెనికేరులోని ఓ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు అది వింత జంతువు కాదని నీటి కుక్క తేల్చారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ నీటి కుక్కను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
కాగా,కపిలేశ్వరపురం,ఆలమూరు ప్రాంతాల్లోని తోటల్లో కొన్నాళ్లుగా నక్కలు సంచరిస్తున్నాయి. పశువులపై దాడులు చేస్తున్నాయి. ఈ విషయం తెలియక రైతులు పశువులను చంపుతున్న జంతువుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ క్రమంలో రైతులకు నీటి కుక్క తారసపడి భయంతో అది బావిలో దూకింది. రైతులు దాన్ని వింత జంతువుగా భావించి అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు దాన్ని నీటి కుక్కగా నిర్దారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.చాలాచోట్ల అడవులను నరికివేస్తున్న కారణంగా వన్యప్రాణులు జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఇటీవల విశాఖ ఏజెన్సీలో ఓ గిరిజనుడు ఎలుగుబంటి దాడిలో గాయపడిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ఏనుగుల మందలు రైతులను హడలెత్తిస్తున్నాయి.ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది.