విజయనగరం, విశాఖ మన్యంలో మరణమృదంగం..ఏజెన్సీ వాసులను వణికిస్తున్న వింత వ్యాధి
ఏపీ ఏజెన్సీలో వింత వ్యాధి ఇప్పుడు అడవి బిడ్డల ఉసురు తీస్తుంది . కరోనా మహమ్మారితోనే పోరాటం సాగిస్తున్న సమయంలో ఓ వింత వ్యాధి విజయనగరం , విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. శరీర భాగాలు పాడైపోయి, కాళ్ళు చేతులు, పొట్ట వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
Recommended Video
ఏపీ ఏజెన్సీలో వింత వ్యాధి ఇప్పుడు అడవి బిడ్డల ఉసురు తీస్తుంది . కరోనా మహమ్మారితోనే పోరాటం సాగిస్తున్న సమయంలో ఓ వింత వ్యాధి విజయనగరం , విశాఖ ఏజెన్సీలో ప్రబలుతోంది. శరీర భాగాలు పాడైపోయి, కాళ్ళు చేతులు, పొట్ట వాపులు వచ్చి గిరిజనులు అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
విజయనగరం ఏజెన్సీలో అంతు చిక్కని వ్యాధి .. గతంలో విశాఖలోనూ
ఇటీవల విశాఖ ఏజెన్సీ అనంతగిరి మండలం లోని రొంపల్లి పంచాయితీ కరకవలస, చినరాభ గ్రామాలలో కడుపునొప్పి, జ్వరంతో పాటుగా కాళ్లు చేతులు విపరీతంగా వాసి గిరిపుత్రులు ప్రాణాలు కోల్పోగా, తాజాగా విజయనగరం జిల్లా పాచిపెంట మండలం చిల్లమామిడి గూడెం కు చెందిన పలువురు గిరిజనులు ఇదే తరహాలో మృత్యువాతపడ్డారు. దీంతో అంతుచిక్కని వ్యాధి ఏమిటో అర్థం కాక గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో బతుకుతున్నారు.
వైద్య సహాయం కోసం అధికారులకు పరిస్థితి చెప్పిన సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర
సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అంతుచిక్కని వింత వ్యాధితో గిరిజనులు మృతి చెందుతున్న విషయాన్ని వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. చిల్లమామిడి గూడెం కు చెందిన ముఖి వెంకటి, ముఖి పెద్దమ్మి , ముఖి అప్పలస్వామి, ముఖి అమ్మన్న, ముఖి గంగమ్మ,ముఖి కోతాయ్య, సింబోయిన సింహాచలం, సింబోయిన చిన్నయ్య తదితరులు కొద్దిరోజుల్లోనే వరుసగా మృతిచెందడంతో, ఆందోళనలో గిరిజనుల ప్రాణాలు కాపాడాలని ఎమ్మెల్యే అధికారులను కోరారు.
కాళ్ళు , చేతులు, పొట్ట వాపులు .. ఆపై మృతి .. వ్యాధిని నిర్దారించలేకపోతున్న వైద్యులు
వ్యాధి లక్షణాలను బట్టి మద్యం తాగడం, మంది కల్లు తాగడం వల్ల తల్లి పోతున్నట్లుగా డాక్టర్లు గుర్తించారు. అయితే దాని వల్ల వస్తున్న వ్యాధి ఏంటనేది నిర్ధారించాల్సి ఉందని, ఉన్నతాధికారులకు మరణాలపై నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు. ఇక ఏజెన్సీ వాసులు మాత్రం వింత వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో ను ఇదే తరహా వింత వ్యాధులు ప్రబలడం తో చాలా మంది ప్రాణాలు కోల్పోగా, వారు పాడైపోయిన జంతువు మాంసం తినడం వల్ల వ్యాధికి గురై మరణించారని వైద్యులు నిర్ధారించారు. అయితే ఏ వ్యాధి అనేది నిర్ధారణ కాకపోవడం గమనార్హం.
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చెయ్యకుంటే మరణ మృదంగం కొనసాగే ప్రమాదం
కాళ్లు చేతులు వాపులు రావడం, శరీర భాగాలు పాడైపోవడం, ఆపై మృత్యువాత పడడం ఏజెన్సీ గ్రామాలలో చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అక్కడ తక్షణం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది . ఏపీలోని చాలా ఏజెన్సీ గ్రామాలకు ఇప్పటికీ వైద్యం అందని పరిస్థితి ఉంది . ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా అవి దగ్గరలో లేవు . దీంతో అడవి బిడ్డలు ఆస్పత్రులకు వెళ్ళలేని పరిస్థితి . అందుకే అక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చెయ్యాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు . లేదంటే మరణ మృదంగం కొనసాగే ప్రమాదం ఉందంటున్నారు.