విజయనగరంలో వింత ఫ్యామిలీ : అంతుచిక్కని మర్మం.. నాలుగేళ్లుగా అలాగే..
విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఓ వింత ఫ్యామిలీ ఉదంతం వెలుగుచూసింది. దాదాపు నాలుగేళ్లుగా ఆ కుటుంబం ఎవరితోనూ మాట్లాడట్లేదు. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉంటాయి. అత్యవసరమైతే తప్ప ఆ ఇంటి యజమాని బయటకు రాడు. ఏ అవసరమైనా సరే.. అతనొక్కడే బయటకు వస్తాడు. అది కూడా జన సంచారం ఎక్కువగా లేని సమయంలో ఇంటినుంచి బయటకు వచ్చి.. వెంటనే లోపలికెళ్లి తలుపులు వేస్తాడు. దారిలో ఎవరైనా పలకరించినా.. చూసీ చూడనట్టే వెళ్లిపోతాడు. చుట్టాలెవరూ వారి ఇంటికి రారు.. కనీసం పిల్లలను కూడా చదువుకునేందుకు స్కూల్కు పంపించరు. ఈ ఫ్యామిలీ గురించి స్థానిక పోలీసులు,విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో మంగళవారం సంబంధిత అధికారులు ఆ ఇంటికి వెళ్లారు.
డిప్యూటీ సీఎం పదవి కావాలని..
పోలీసులు ఆ ఇంటికి వెళ్లి... కుటుంబ యజమాని ఈశ్వర్ రావుతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అతను పొంతన లేని సమాధానాలు చెప్పాడు. తనను డిప్యూటీ సీఎం చేయాలని,విజయనగరం బాధ్యతలు అప్పగించాలని ఏవేవో చెప్పాడు. ప్రభుత్వ స్కూళ్లలో తిరిగి తెలుగు బోధనను ప్రవేశపెట్టాలన్నారు. వీలైతే విజయనగరం వరకు ఆ అవకాశాన్ని ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో విద్యా విధానం బాగోలేదన్నారు. అమ్మఒడి కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. కార్పోరేట్ స్కూళ్లలో చదివేవారికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు.
ఇంట్లోనే బంధీలుగా..
చూసేందుకు ఆ ఇల్లు చాలా బాగుంది. ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఏమీ లేనట్టు అనిపిస్తోంది. మరెందుకు.. ఇంట్లోనే వారు బంధీలుగా ఉండిపోతున్నారన్నది అంతుచిక్కడం లేదు.
ఇంట్లో నుంచి ఎందుకు బయటకు రావట్లేదు.. ఎందుకు ఎవరితోనూ మాట్లాడట్లేదు అని స్థానికులు ప్రశ్నించగా.. వారి వద్ద సమాధానం కరువైంది. పొంతన లేని సమాధానాలు విని స్థానికులు,అధికారులు నోరెళ్లబెట్టారు. కనీసం పిల్లలనైనా స్కూలుకు పంపించాలని కోరగా.. అందుకు కూడా నిరాకరించారు.
రంగంలోకి పోలీసులు..
పోలీసులు ఎంతోసేపు నచ్చజెపితే గానీ పిల్లలను స్కూలుకు పంపించేందుకు.. వారు ఒప్పుకోలేదు. ఇప్పటికైతే అలా ఓకె అని చెప్పినప్పటికీ.. తర్వాత ఏం చేస్తారన్నది తెలియదు. బహుశా ఆ కుటుంబం మానసిక సమస్యలతో బాధపడుతోందని బొబ్బిలి ఏఎస్ఐ అనుమానం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించి వారికి అవసరమైన మెంటల్ హెల్త్ చెకప్ చేయించాల్సిన అవసరం ఉందన్నారు.
నాలుగేళ్లుగా.. ఆ కుటుంబం బయటకు రావట్లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.
విస్తుపోతున్న స్థానికులు..
ఈశ్వర్ రావు దంపతుల పిల్లలు రెండేళ్ల క్రితం వరకు స్థానికంగా ఓ స్కూల్లో చదివేవారని తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి వారిని స్కూల్ మానిపించి ఇంటికే పరిమితం చేశారని సమాచారం. కనిపిస్తే.. ఏమైనా ఆరా తీద్దామని స్థానికులు ప్రయత్నించినా.. ఎప్పుడూ ఇంటి నుంచి బయటకు రారు. దాంతో నాలుగు గోడల నడుమ ఏళ్లుగా వాళ్లు ఎలా ఉండగలుగుతున్నారని అక్కడివారు విస్తుపోతున్నారు. అధికారులు అవసరమైన చర్యలు చేపట్టి.. వారి సమస్యలను గుర్తించి పరిష్కారించాలంటున్నారు.