విచిత్రం ... ఎన్టీఆర్ ఫోటోను వాడేస్తున్న రాజకీయ పార్టీల నేతలు
Recommended Video
నిన్నటి దాకా స్నేహం చేసినంత మాత్రాన సోనియా గాంధీ బొమ్మను టీడీపీ వాడుకుంటుందా? ఇక మోడీ సపోర్ట్ చేసినంత మాత్రాన మోడీ బొమ్మను వైసీపీ వాడుకుంటుందా? ఇక వైసీపీ , టీఆర్ఎస్ దోస్తానా ఉన్నంత మాత్రాన కేసీఆర్ బొమ్మను వైసీపీ వాడుకుంటుందా? ఇక తెలంగాణా సిద్ధాంత కర్త జయశంకర్ బొమ్మను బీజేపీ పెట్టుకోగలదా? అంటే అది సాధ్యం కాదని గట్టిగా చెప్పేస్తారు ఎవరైనా .. కానీ మరే పార్టీలో లేని విచిత్రం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫోటో విషయంలో చోటు చేసుకోవటం చూస్తుంటేఎన్టీఆర్ అందరి వాడా? లేకా టీడీపీ పట్టించుకోవటం లేదా అనిపిస్తుంది.
పార్టీలకు అతీతంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఫోటో బ్యానర్లపై పెట్టే కల్చర్
ఎన్టీఆర్ .. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు .. తెలుగు దేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ గుర్తింపు పొందిన నేత . అంతటి ఘనత వహించిన రాజకీయ నాయకుడు అయిన ఎన్టీఆర్ ఫోటోను వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరైనా వాడేసే పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. ఒక్క టీడీపీ నేతలే కాదు చాలా మంది ఇతర పార్టీల నేతలు కూడా ఎన్టీఆర్ ఫోటోను తమ బ్యానర్ల మీద ఎడాపెడా వాడటం చూసే వారికి విస్మయం కలిగిస్తుంది. ఇటీవల కాలంలో ఆ కల్చర్ బాగా పెరుగుతుంది. ఎన్టీఆర్ బొమ్మను ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని పార్టీల వారు వాడేయటం పరిపాటిగా మారింది . వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీల్లోనూ.. బ్యానర్లలోనూ.. కొద్దిమంది అభిమానులు ఇచ్చిన ప్రకటనల్లోనూ ఎన్టీఆర్ ఫోటో ఉండటం గమనార్హం . 2019 ఎన్నికలకు ముందుగా ఈ తీరు ఎక్కువగా కనిపించేది.
ఎన్టీఆర్ ఫోటోతో గతంలో వైసీపీ బ్యానర్ .. ఇప్పుడు ఇప్పుడు తాజాగా బీజేపీ బ్యానర్
గతంలో 2018లో పెదకమిడి గ్రామంలోని సాయిబాబా ఆలయం సమీపంలో అప్పటి వైసీపీ కన్వీనర్ అబ్బయ్య ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అటు, ఇటు దివంగత నేతలు ఎన్టీఆర్, వైయస్సార్ ఉండగా వారి మధ్య జగన్, అబ్బయ్య ఫొటోలు ఉన్నాయి. అందులోనే కొడాలి నాని ఫొటో కూడా ఉంది. ఇక ఈ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది . ఆ తర్వాత చాలా మంది చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ ను తమ ఫ్లెక్సీలలో, ప్రచారంలో తెగ వాడేశారు . తాజాగా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి మద్దతుదారులు సైతం ఎన్టీఆర్ బొమ్మను యదేచ్ఛగా వాడేస్తున్నారు. బీజేపీలోకి జంప్ అయ్యాక తొలిసారి విజయవాడకు వస్తున్న సుజనాకు స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన ప్రచారంలో ఎన్టీఆర్ ఫోటోను ప్రముఖంగా వేయటం ఆసక్తికరంగా మారింది.
ఎవరు పడితే వారు వాడేస్తున్న తెలుగుదేశం దివంగత నేత ఎన్టీఆర్ ఫోటో .. టీడీపీ స్పందన ఏంటో ?
సుజనా ప్రస్తుతం ఉన్న పార్టీ బీజేపీ, ఇక ఎన్టీఆర్ కు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఫోటోను విపరీతంగా వాడేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజా పరిణామాలు చూస్తే.. ఎన్టీఆర్ ఫోటోను ఎవరైనా వాడేయొచ్చా? అడిగేవాడే ఉండడా? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి . రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలకు ఆమోదయోగ్యుడైన నేత ఎన్టీఆర్ అని అందరూ భావించినప్పటికీ ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి ఫోటో ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ ఇష్టారాజ్యంగా వాడొచ్చా అన్నది ప్రశ్నగా మారింది. ఈ వాడకంపైన టీడీపీ ఏమంటుందో మరి వేచి చూడాలి .