ఆస్తి ఎంత ఉన్నా...అంతస్థు మాత్రం ఒక్కటే!..వింత ఆచారం
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలోని ఆ ఊరి పేరు పాత సింగరాయకొండ. ఈ గ్రామంలో కొలువైవున్నలక్ష్మీ నృసింహని దేవాలయం రాష్ట్రంలోని ప్రఖ్యాత స్వామి క్షేత్రాల్లో ఒకటి. అయితే ఈ గ్రామంలో చాలామందికి తెలియని ఓ వింత ఆచారం ఒకటి అమలులో ఉంది. ఆ గ్రామస్తులు ఈ ఆచారాన్నిపది కాదు...ఇరవై కాదు... వందల ఏళ్ల నుంచి భక్తిశ్రద్దలతో పాటిస్తున్నారు.
ఇంతకీ ఆ ఆచారం ఏమిటో తెలుసుకునేముందు మనం ఈ గ్రామాన్ని ఒక్కసారి చూడాలి...పట్టణానికి ఎంతో దగ్గరలో ఉండే ఈ ఊళ్లో మనం ఎంత వెతికినా కేవలం ఒకే ఒక అంతస్తు ఉండే డాబా ఇళ్లే తప్ప పైన అంతస్తు వేసిన మిద్దె ఒక్కటి కూడా కనిపించదు...
ఊళ్లో డాబాలకి...ఆచారానికి సంబంధం...
అయితే మిద్దె మీద మిద్దె కనిపించక పోవడానికి ఆచారానికి సంబంధమేమిటంటే...సంబంధం ఉంది...అదేమిటంటే...కోరిన కోర్కెలు తీర్చే ఆపద్బాంధవుడిగా నృసింహ స్వామిని ఇక్కడి ప్రజలు ఎంతో భయభక్తులతో కొలుచుకుంటారు. అసలు స్వామి సేవలో తరించేందుకే శతాబ్దాల క్రితం ఈ పాత సింగరాయకొండ గ్రామం ఏర్పడిందని నమ్ముతారు.
స్వామి కోసమే...ఈ గ్రామం...
ఈ గ్రామస్తులు కొండపై వెలసిన ఈ స్వామిని పూజిస్తూ...చుట్టూ ఉన్న అడవిని బాగు చేసుకొని...వాటిని పొలాలుగా మార్చి పంటలు పండించడం ప్రారంభించారట...అలా క్రమంగా గ్రామంలో ప్రజల ఆదాయం బాగా పెరిగిందట. అయితే అలా ఈ ఊళ్లో వాళ్లు ఎంత డబ్బు గడించినా...ఎన్ని ఆస్తులు గడించినా... ఊరంతా ఒకే కట్టుబాటతో ఉంటారు. కేవలం ఒక అంతస్తు ఇల్లు మాత్రమే నిర్మించుకుంటారు...అందుకే ఈ ఊళ్లో ఎక్కడ చూసినా డాబా ఇళ్లు మాత్రమే కనిపిస్తాయి...
అన్నీ డాబా ఇళ్లే...కారణం ఏంటంటే...
ఇంటిపై రెండో అంతస్తు వేస్తే గ్రామంలోని స్వామి కంటే ఎత్తులో ఉంటామని...దీని వల్ల స్వామి అనుగ్రహం తమకు కలగదని ఈ గ్రామస్తుల నమ్మకం. అందుకే స్వామి దయ ఎల్లప్పుడూ తమపై ఉండాలనే కోరికతో ఒక్క స్లాబ్ ఇంటిని మాత్రమే నిర్మిస్తారు. ఎంతటి స్థితిమంతులైనా ఇలాంటి సాధారణ డాబా ఇళ్లే నిర్మిస్తారు...అలాంటి ఇళ్లలోనే నివాసం ఉంటారు. ఈ ఆచారం సుమారు 400 ఏళ్ల క్రితం గ్రామం ఏర్పడిన నాటి నుంచి అమలులోనే ఉందని...దాన్ని ఏ ఒక్కరూ అతిక్రమించకుండా భక్తిశ్రద్దలతో కొనసాగించుకుంటూ వస్తున్నామని గ్రామస్తులు చెబుతుంటారు.
మరికొన్ని ఆచారాలు...అందుకే స్పెషల్...
అంతేకాదు ఈ గ్రామం వారు అప్పటి నుంచి ఇంతే భక్తిశ్రద్దలతో పాటిస్తున్న మరి కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామంలో జరిగే పెళ్లిళ్లు అన్నీ లక్ష్మీనృసింహుని స్వామి వారి సన్నిధిలో జరగాల్సిందే. అలాగే లక్ష్మీ నృసింహ స్వామిని స్థానికంగా తాత స్వామి అని... తాతయ్య దేవుడని పిలుచుకుంటారు. అందుకే గ్రామంలో ఇంటిలో ఎవరికో ఒకరికైనా తాతయ్య, నరసింహ అనే పేరు ఉండి తీరాల్సిందే...ఇవండీ ఈ పాత సింగరాయకొండ గ్రామం ప్రత్యేకతలు...