సంచలనం:శవం కోసం తవ్వితే గొర్రె కళేబరం...శరీరభాగమే హంతకులను పట్టించింది
చిత్తూరు జిల్లాలో ఓ హత్య కేసు సంచలనం సృష్టించింది. అటవీ ప్రాంతంలో అనుకోకుండా ఒక వ్యక్తి శరీర అవశేషం స్థానికుల కంట బడటంతో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి వ్యక్తి శరీర భాగం కనపడిన ప్రాంతంలో తవ్వకాలు జరపగా అక్కడ ఒక గొర్రె కళేబరం కనిపించడంతో ఖంగుతిన్నారు.
అయితే స్థానికులకు కనిపించిన ఆ శరీర భాగం ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ జరపగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కనిపించకుండా పోయాడనే విషయం తెలిసింది. దీంతో పోలీసులు లోతుగా విచారణ జరపగా మిస్సంగ్ కేసు మిస్టరీ వీడటమే కాదు అతడు హత్యకు గురయ్యాడని తెలిసింది. ఈ తరువాత హంతకులు దొరకడమే కాదు హతుడి శవం కూడా దొరికింది. వివరాల్లోకి వెళితే...
చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని మద్దయ్యగారిపల్లి పంచాయతీ బురుజుపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి స్థానికులకు ఓ వ్యక్తి శరీరం నుంచి తెగిపడిన భాగం కనిపించింది. దీంతో భయభ్రాంతులైన వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో శుక్రవారం మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి, సీఐ రుషికేశవ్, తహశీల్దార్ హనుమంతు, ఎస్ఐలు రవికుమార్, ఈశ్వరయ్య గ్రామానికి చేరుకుని శరీర భాగం బయటపడిన ప్రాంతంలో తవ్వకాలు నిర్వహించారు. అయితే అక్కడ అనూహ్యంగా గొర్రె కళేబరం బయట పడింది. దీంతో గ్రామస్థుల కంటపడిన ఆ శరీరభాగం ఎవరిదనే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
అయితే బురుజుపల్లి గ్రామానికి చెందిన జరిపిటి నరసింహులు (45) అనే వ్యక్తి ఏప్రిల్ 2వ తేదీ నుంచి కనిపించడంలేదని అతడి అత్త చౌడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసింది. దీంతో ఆమెని వివరాలు అడుగగా కుందేళ్ల వేటకు వెళదామని తమ గ్రామానికే చెందిన వ్యక్తి ముందురోజు రాత్రి తమ ఇంటికి వచ్చి అల్లుడిని బైటకు తీసుకెళ్లాడని, అప్పటి నుంచి అతడు తిరిగి ఇంటికి రాలేదని ఆమె పోలీసులకు తెలిపింది.
దీంతో పోలీసులు ఆమె చెప్పిన వివరాల ప్రకారం అనుమానితులు వెంకట్రమణారెడ్డి, రాజేష్రెడ్డి, కుమార్రెడ్డి, నాగరాజు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ పరుపగా వారు నరసింహులుని తాము హత్య చేసిన విషయం వెల్లడించారు.
అంతేకాదు అతడిని తాము చంపిన వైనం, శవాన్ని పాలిపెట్టిన స్థలం కూడా చూపించారు. నరసింహులు తమ గొర్రెలను కాజేస్తున్నడని, ఆ క్రమంలోనే రామస్వామి అనే వ్యక్తిని కూడా చంపాడని హంతకులు చెబుతున్నారు. అందుకే నరసింహులు చంపేసేయాలని, ఇందుకోసం బురుజుపల్లి గ్రామానికే చెందిన నాగరాజు సహకారం తీసుకున్నారు. కుందేళ్ల వేటకు వెళదామని నాగరాజు ఈ నెల 2న నరసింహులు ఇంటికి వెళ్లి అతన్ని వెంట తీసుకెళ్లాడు.
ఆ తరువాత పథకం ప్రకారం నాగరాజుతో పాటు వెంకట్రమణారెడ్డి, రాజేష్రెడ్డి, కుమార్రెడ్డి కలిసి నరసింహులును గ్రామ శివారులోని దయ్యాల చెరువు ముళ్ల పొదల్లో గడ్డపార, కొడవలితో నరికి హత్య చేశారు. ఆ ప్రదేశంలో రక్తపు ఆనవాళ్ళు లేకుండా గడ్డితో కాల్చి వేశారు. అనంతరం అతడి శవాన్ని దయ్యాల బావిలో పూడ్చి పెట్టారు.హతుడు నరసింహులు భార్య పదేళ్ల క్రితం చనిపోగా ఇతడికి మహేష్ (14), భవాని (10) అనే సంతానం ఉన్నారు.