వంగవీటిపై గౌతం రెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మం?: పక్కా వ్యూహమేనా!, ఏం జరుగుతోంది?
విజయవాడ: రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అన్నట్లే.. ఏళ్లుగా వైరం ఉన్న నేతలిద్దరు ఒకే పార్టీలో ఇమిడిపోవడం అంతే కష్టం. కష్టంగా కొంతకాలం నెట్టుకొచ్చినా.. ఏదో ఒకరోజు విభేదాలు బహిర్గతం కాకమానవు.
''నన్ను ఓడించేందుకు ప్రయత్నించారు'', ''నా వ్యాపారాలేమిటో తెలియవా''?
తాజాగా బెజవాడలో వంగవీటి రాధా-గౌతంరెడ్డిల ఎపిసోడ్ ఇదే విషయాన్ని తలపించింది. అయితే ఇన్నాళ్లు వంగవీటి రాధా పట్ల అంతగా దూకుడు ప్రదర్శించని గౌతంరెడ్డి.. ఉన్నట్లుండి ఒక్కసారిగా అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది ఎవరికీ అంతుపట్టని విషయం. సంచలనం క్రియేట్ చేయడం ద్వారా తన పొలిటికల్ మైలేజీ పెంచుకోవాలనుకున్నారా?.. లేక బయటి పార్టీల ఆఫర్ల మేరకే పరోక్షంగా తెగదెంపులకు సిద్దపడ్డారా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ వైపు చూస్తున్నాడా?:
నిజానికి చాలాకాలంగా గౌతంరెడ్డి పార్టీ పట్ల అసంతృప్తితోనే ఉన్నారు. తనను కాదని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ బాధయతలు అప్పగించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో మల్లాది విష్ణు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడం కూడా ఆయనకు మింగుడుపడటం లేదని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏపీలో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. గౌతంరెడ్డికి గాలం వేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఆయన కావాలనే వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, సస్పెండ్ చేయడం జరిగిపోయాయని భావిస్తున్నారు.
బీజేపీకి ఏం లాభం?:
నిజానికి గౌతంరెడ్డి వంగవీటి రంగాపై చేసిన వ్యాఖ్యలు కాపు సామాజికవర్గంలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగేలా చేశాయి. కాపు సామాజికవర్గంలో రంగా&రాధాకు అభిమానులు, అనుచరులు భారీ సంఖ్యలో ఉన్నారు. అలాంటివారిని ఎదిరించడం ద్వారా గౌతంరెడ్డికి లాభం కన్నా నష్టమే ఎక్కువంటున్నారు. ఇలాంటి స్థితిలో బీజేపీ అయినా ఆయన్ను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తుందనేది చాలామందికి తలెత్తుతున్న అనుమానం. కాబట్టి బీజేపీ ఆయనకు గాలం వేసిందన్న మాటల్లో పస లేదని చెబుతున్నారు.
అసలెందుకు ఆ వ్యాఖ్యలు?:
నిజానికి సమయం, సందర్భం లేకుండా గౌతంరెడ్డి వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది అంతుపట్టడం లేదు. ఆయన రాజకీయ ప్రయాణం స్తబ్దుగా సాగుతుంది కాబట్టి.. కావాలనే ఓ సంచలనం క్రియేట్ చేయాలనుకున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తద్వారా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారితే.. పొలిటికల్ మైలేజీ ఏమైనా పెరుగుతుందని భావించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సెల్ఫ్ గోల్:
నిజానికి వేరే పార్టీలో చేరాలనుకుంటే.. గౌతంరెడ్డి నేరుగా వెళ్లి ఉండాల్సిందని, ఇలా చేయడం ద్వారా సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంచలనం ద్వారా తన ఉనికి చాటుకోవాలని గౌతం రెడ్డి తాపత్రయపడినప్పటికీ.. జరిగిన పరిణామాలన్ని జనంలో ఆయన పట్ల వ్యతిరేకత పెంచేవిగా మారాయంటున్నారు. దీంతో ఇప్పుడాయన్ను చేర్చుకోవడానికి ఇతర పార్టీలు కూడా అంతగా ఆసక్తి చూపించవనే వాదన వినిపిస్తోంది.