విశాఖ గ్యాస్ లీక్: పిల్లలపై పెను ప్రభావం: తల్లిదండ్రుల చేతుల్లో సొమ్మసిల్లుతూ: ఆసుపత్రుల్లో
విశాఖపట్నం: విశాఖపట్నం సమీపంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో వెలువడిన విషవాయువుల ప్రభావం చిన్నపిల్లలపై పెను ప్రభావాన్ని చూపుతోంది. వారిని ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఎనిమిదేళ్ల లోపు పిల్లలు శ్వాస తీసుకోవడానికి అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందక విలవిల్లాడుతున్నారు. తల్లిదండ్రుల చేతుల్లోనే సొమ్మసిల్లిపోతున్నారు. విష వాయువుల ప్రభావానికి గురై ఆసుపత్రుల్లో చేరిన వారిలో చిన్నిపిల్లలే అధికంగా కనిపిస్తున్నారు.
గాఢనిద్రలోనే..ఊపిరి అందక విలవిల్లాడుతూ: ప్రమాదకరమైన స్టైరీన్ గ్యాస్గా: విశాఖకు జగన్..
ఎక్కడివారక్కడే సొమ్మసిల్లుతూ..
సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగాయి. ఆర్ఆర్ వెంకటాపురానికి చేరుకున్నాయి. ప్రత్యేక వాహనాల్లో స్థానికులను తరలిస్తున్నాయి. రోడ్డు మీద, కాలువల్లో, వీధుల్లో ఎక్కడికక్కడ సొమ్మసిల్లిపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. మొబైల్ ఆసుపత్రులను అందుబాటులోకి తీసుకుని రానుంది ప్రభుత్వం. వెంటిలేటర్లను అమర్చిన అంబులెన్స్లను సంఘటనా స్థలానికి తరలించింది.
చిన్నపిల్లల రోదనలు.. తల్లిదండ్రుల భయాందోళనలతో
విష వాయువులు విడుదలైన ఘటన చిన్నపిల్లలపై దుష్ప్రభావాన్ని చూపుతోంది. చిన్నపిల్లలు ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్ల వారి ఒళ్లంతా చెమటతో తడిచిపోతోంది. పిల్లల దుస్తులను విప్పించి.. గాలి ఆడేలా చేస్తున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల చేతుల్లోనే నీరసించిపోతున్నారు. తమ పిల్లలను ఆసుపత్రులకు తరలించడానికి తల్లిదండ్రులు అంబులెన్స్ల కోసం పరుగులు పెడుతున్నారు. కళ్ల మంటలతో పిల్లలు బాధపడుతున్నారు. వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
Recommended Video
మూగ జీవాల మృత్యువాత..
ఎల్జీ పాలిమర్స్ సంస్థలో విడుదలైన విష వాయువుల వల్ల మూగజీవాలు కొన్ని మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది. నురగలు కక్కుకుంటూ ఉన్న చోటే రాలిపోతున్నాయి. వీధి కుక్కులు, పెంపుడు జంతువులు, ఆవులు, ఎద్దులు విష వాయువుల ప్రభావానికి గురయ్యాయని అంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థలో విడుదలైన గ్యాస్ను స్టైరీన్గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైనదని అంటున్నారు. దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదని సమాచారం. మొన్నటి దాకా లాక్డౌన్లో ఉందీ కంపెనీ. పరిశ్రమలకు మినహాయింపులను ఇవ్వడంతో ఇక్కడ కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాయి.