సమ్మెబాటే: ఏపిఎన్జీవోలు, ఉండనివ్వమన్న శ్రీనివాస్
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపిఎన్జీవోల సంఘం తన కార్యాచరణను ప్రకటించింది. ఏపిఎన్జీవో హోమ్లో సోమవారం సమావేశమైన ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించాయి. ఫిబ్రవరి 6 నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపిఎన్జీవోల సంఘం పేర్కొంది.
ఫిబ్రవరి 6 నుంచి సమ్మె బాట పట్టనున్నట్లు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7,8,9 తేదీల్లో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నట్లు ఏపిఎన్జీవోల సంఘం తెలిపింది. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు ఏపిఎన్జీవోల సంఘం పేర్కొంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీల్లో చలో ఢిల్లీని నిర్వహించనున్నట్లు ఉద్యోగ సంఘాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఏపిఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లును పెట్టకుండా అడ్డుకుంటామని అన్నారు. 13 జిల్లాలో ఉద్యోగ సంఘాలతో భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని ఆయన తెలిపారు. తమ ఆందోళనకు రాజకీయ నాయకులు కూడా కలిసి రావాలని ఆయన కోరారు. విభజనను అడ్డుకునేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తామని అన్నారు.
ఫిబ్రవరి 6 ఉదయం నుంచి ఉద్యోగ సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతాయని అశోక్ బాబు తెలిపారు. గతంలో 66 రోజులు సమ్మె చేశామని గుర్తు చేశారు. పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తే తాము పడిన కష్టమంతా వృథా అవుతందని అన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని, 13 జిల్లాల్లో సమ్మె జరుగుతుందని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం 11.30గంటలకు ప్రభుత్వ కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు అందజేస్తామని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనేందుకు రెండు రోజులు సమయం కావాలని కోరారని తెలిపారు. సమ్మెలో అన్ని సంఘాలను కలుపుకు పోతామని అశోక్ బాబు అన్నారు. అవసరమైతే ఎన్నికల డ్యూటీని కూడా విడిచిపెట్టి సమ్మెలో పాల్గొనేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల పనులు కూడా స్తంభించిపోతాయని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా సమ్మెలో పాల్గొనే విషయంపై చర్చిస్తున్నారని చెప్పారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు సమైక్యవాదానికి కట్టుబడి ఉండాలని కోరారు. అవిశ్వాసం పెడతామన్న కాంగ్రెస్ ఎంపీలు, విభజనకు మద్దతుగా ఉంటే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు అధిష్టానాలపై ఒత్తిడి తేవాలని కోరారు. అసెంబ్లీలో లాగే పార్లమెంటులో కూడా అన్ని పార్టీలు ఐక్యంగా బిల్లును వ్యతిరేకించాలని అన్నారు. తమ ఆందోళనలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపజేస్తామని అన్నారు.
రైలు రోకో, రహదారుల దిగ్బంధం, బ్యాంకుల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యుత్ ను కూడా నిలిపివేసేందుకు వెనకాడబోమని అన్నారు. ఫిబ్రవరి 6 నుంచి పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని చెప్పారు. తమ జీతాలు కూడా లెక్క చేయకుండా ఉద్యోగులు సమ్మె చేయనున్నారని, ప్రజలు ఇందుకు సహకరించాలని కోరారు. సమ్మెకు సహకరిస్తున్న ఉద్యోగ సంఘాలకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 7న అఖిలపక్షం నిర్వహిస్తామని, 17, 18 తేదీల్లో చలో ఢిల్లీ నిర్వహించే యోచనలో ఉణ్నట్లు తెలిపారు.
తెలంగాణను అడ్డుకుంటే ఉపేక్షించం: శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ బిల్లును అడ్డుకునేవారిని ఇక ఉపేక్షించబోమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అడ్డుకునే సమైక్యవాదులను హైదరాబాద్లో ఉండనివ్వబోమని ఆయన అన్నారు.