అక్క చెప్పినా!, ఆ బాధ నుంచి తేరుకోలేక.. 'హరిత' ఆత్మహత్యతో కన్నీరుమున్నీరైన కుటుంబం
చోడవరం: పరీక్షలంటే చాలు ఒకరకమైన ఆత్మన్యూనత విద్యార్థులను వేధిస్తోంది. పరీక్షకు ముందు పూర్తి స్థాయిలో సన్నద్దమైనా.. తీరా పరీక్ష సమయానికి అనుకున్న విధంగా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు మనస్తాపానికి గురవుతున్నారు. ఆ క్రమంలో వారు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం విచారించాల్సిన విషయం.
తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ప్రియాంక అనే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ లోని చోడవరంలో మరో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థిని కూడా ఇలాగే ఆత్మహత్యకు పాల్పడింది.
హరిత నేపథ్యం:
చోడవరం లక్ష్మీనగర్లో నివాసముంటున్న రుప్ప లక్ష్మీనర్సమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పిల్లలు పుట్టిన కొన్నాళ్లకే భర్త చనిపోవడంతో కుటుంబ భారాన్ని మొత్తం లక్ష్మీ తనపైనే వేసుకుంది. పెద్ద కుమార్తెకు వివాహం జరిపించింది.
చిన్న కుమార్తె హరిత (18) చోడవరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుల్లో ఒకరు ఉద్యోగం, మరొకరు మోటారు ఫీల్డులో పనిచేస్తున్నారు.
డిగ్రీ పరీక్షలు:
హరిత ప్రస్తుతం డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తోంది. ఇంకా ఒక పరీక్ష మాత్రమే మిగిలి ఉ:ది. అయితే ముందు రాసిన పరీక్షలు సరిగ్గా రాయలేకపోయానని హరిత మనస్తాపం చెందింది. సోమవారం నాడు తమ ఇంటికి సమీపంలోనే ఉన్న అక్క ఇంటికి వెళ్లింది. అదే విషయాన్ని అక్కతోను చెప్పుకుని బాధపడింది. అక్క లీలావాణి చెల్లెలికి సర్ది చెప్పి.. పరీక్ష మళ్లీ రాయొచ్చులే అని ధైర్యం చెప్పింది.
మనస్తాపంతో ఆత్మహత్య:
చెల్లెలికి నచ్చజెప్పిన తర్వాత.. తన పరీక్షల నిమిత్తం లీలావాణి శ్రీకాకుళం వెళ్లింది. అక్క ఎంత చెప్పినా బాధ నుంచి బయటపడని హరిత.. మరింత మనస్తాపానికి లోనైంది. అక్క ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సోమవారం రాత్రి చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
కుటుంబంలో విషాదం:
అక్క ఇంటికి వెళ్లిన కుమార్తె ఇంకా తిరిగిరాకపోయే సరికి లక్ష్మీనర్సమ్మ తన పెద్ద మనుమరాలిని అక్కడికి పంపించింది. అక్కడికి వెళ్లిన చిన్నారి.. గదిలో ఫ్యాన్కు వేలాడుతున్న హరితను చూసి భయపడి కంగారుగా పరుగెత్తుకొచ్చింది. విషయం ఇంట్లో చెప్పడంతో అంతా ఆ ఇంటికి పరిగెత్తారు. అప్పటికే హరిత మృతి చెందినట్లు గుర్తించారు. దీంతో ఆ కుటుంబం బోరున విలపించింది. చెల్లెలిని పోగొట్టుకున్న దు:ఖంలో అన్నదమ్ములు.. బిడ్డను చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యారు.