ఆంధ్ర యూనివర్సిటీలో కలకలం: హాస్టల్లో విద్యార్ధి ఉరేసుకుని ఆత్మహత్య
అమరావతి: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ హాస్టల్లో ఓ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ సమీపాన ఉన్న మమతా హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్లోని కిటికీకి ఉరేసుకుని న్యాయ విద్యార్థి యశస్వి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఘటనాస్థలిలో యశస్వి రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో తాను వ్యసానాలకు బానిస అయినందున మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడు. మంగళవారం అర్థరాత్రి వరకూ గదిలో ఉన్న స్నేహితులు కరెంటు పోవడంతో హాస్టల్ మేడపైకి వెళ్లారు.
వారితో పాటు హాస్టల్ పైకి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయిన యశస్వి తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. యశస్వి స్వగ్రామం గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిద్రిస్తున్నవారిపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు
కడప జిల్లా ప్రొద్దుటూరులో బుధవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. కోనేటికాలనీలో ఓ కుటుంబంపై విచక్షణారహితంగా దాడికి దిగారు. వేటకొడవళ్లను తమ వెంట తెచ్చుకున్న దుండగులు ఓ ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబంపై దాడి చేశారు. కుటుంబంలోని వారు నిద్రిస్తుండగానే వారిపై దాడి చేసి గొంతుకోసి పారిపోయారు.
దుండగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.