పట్టా ఇచ్చి పంపుతారనుకుంటే...బిడ్డను ఇచ్చి పంపారు...పద్మావతి డిగ్రీ హాస్టల్లో దారుణం...
తిరుపతి: విద్యాబుద్దులు నేర్పించి...పట్టా ఇచ్చి పంపిస్తారని తల్లిదండ్రులు ఎంతో ఆశతో తమ కుమార్తెను దూరభారం అనుకోకుండా వందల కిలోమీటర్ల దూరం చదువు కోసం పంపిస్తే...ఆ బిడ్డను కళాశాల వాళ్లు పంపిన తీరుతో గుండె కోతకు గురిచేసింది.
తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో చోటుచేసుకొని ఆలస్యంగా వెలుగు చూసిన అమానుష ఘటన వివరాలివి...తిరుపతి శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నవిద్యార్థిని డిసెంబరు 31 తేదీన కడుపునొప్పిగా ఉందని హాస్టలు సిబ్బందితో చెప్పడంతో, వారు ఆమెను తితిదే సెంట్రల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థిని గర్భిణి అని నిర్ధారించారు. ఆ తరువాత ఆ విద్యార్థిని తిరుపతిలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు తరలించగా...జనవరి 1వ తేదీన ఆ విద్యార్థిని బిడ్డను ప్రసవించింది.
అప్పటివరకు ఈ విషయాన్ని బైటకు పొక్కకుండా జాగ్రత్త వహించిన వసతి గృహ సిబ్బంది...ఆ తరువాత గుంటూరు జిల్లా జొన్నలగడ్డకు చెందిన ఆ డిగ్రీ విద్యార్థినిని పురిటిబిడ్డతో సహా తల్లిదండ్రుల వద్దకు పంపారు. దీంతో ఈ విషయం బైటకు తెలిసి తదనంతరం టిటిడి అధికారుల వద్దకు చేరింది. దీంతో ఈ వ్యవహారంపై తితిదే విద్యాశాఖ విచారణ చేయాల్సిందిగా విజిలెన్స్ శాఖను కోరడంతో ఈనెల 13నుంచి కళాశాల వసతి గృహంలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను తితిదే విద్యాశాఖకు అందించడంతో వసతి గృహ అధికారులకు మెమోలు అందాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన వసతి గృహ విద్యార్థినుల పట్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, శిరీష, మాట్రిన్ కావమ్మలను వివరణ కోరుతూ తితిదే విద్యాశాఖాధికారి రామచంద్ర మెమోలు ఇచ్చారు. దీంతో ఈ విషయం మీడియాకు వెల్లడయింది.