భవనంపై నుంచి పడి విద్యార్ధి మృతి, మురుగు కాల్వలో శిశు మృతదేహాలు
అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో ఓ ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. స్కూలు భవనంపై నుంచి కిందపడి 3వ తరగతి విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం వెంకన్న(9) అనే విద్యార్థి నగర పాలక సంస్థ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు.
ఇంటర్వెల్ సమయంలో స్కూల్ భవనంపై నుంచి ఆడాడుకుంటుండగా ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందకు పడిపోయాడు. దీంతో వెంకన్న తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సన్ సైడ్పై నుంచి జారి పడటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
సమాచారం అందుకున్న విద్యార్థి కుటుంబసభ్యులు, బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడంటూ విదార్ధి తల్లిదండ్రులు ఆరోపించారు.
పాఠశాల యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మురుగు కాల్వలో నాలుగు శిశు మృతదేహాలు
కర్నూలులో దారుణమైన సంఘటన సోమవారం వెలుగుచూసింది. అప్పుడే పుట్టిన నలుగురు ఆడ శిశువులను గుర్తుతెలియని వ్యక్తులు కాల్వలో పడేశారు. వివరాల్లోకి వెళితే కర్నూలు పట్టణంలోని ఆనంద్ థియేటర్ సమీపంలోని బ్రిడ్జి పక్కనే ఉన్న మురికి కాల్వలో మున్సిపల్ సిబ్బంది మంగళవారం మురుగు తీస్తుండగా, నాలుగు ఆడ శిశువుల మృతదేహాలు లభించాయి.
దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పుట్టక ముందే ఆడ పిల్లలని తెలియడంతో అబార్షన్ చేసి మురుగు కాల్వలో పడేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.