కోర్కె తీర్చకుంటే...నీ కొడుకు భవిష్యత్తు బుగ్గే!: విద్యార్థి తల్లికి హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు
అమరావతి:ఆమె భర్త ఓ దివ్యాంగుడు...దురదృష్టవశాత్తూ కుమారుడు కూడా దివ్యాంగుడు జన్మించడంతో కుంగిపోయింది. నిరుపేద గిరిజన కుటుంబంలో అవకరంతో జన్మించిన తన కుమారుడిని బాగా చదివిస్తే కనీసం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందని ఆ తల్లి ఆలోచించింది. అందుకే కొడుకును గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చేర్పించి కష్టపడి కొడుకును చదివిస్తోంది.
అయితే అదే ఆమె పాలిట శాపంగా మారింది. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించి వారికి సత్ప్రవర్తన నేర్పాల్సిన అక్కడి ప్రధానోపాధ్యాయుడు తానే దారితప్పి ఈ దివ్యాంగ విద్యార్థి తల్లి పాలిట మృగాడిగా మారాడు. తన కోరిక తీరిస్తే నీ కొడుకు భవిష్యత్తుకు బంగారు బాటలు పరుస్తానని...లేకుండా అతడి భవిత బుగ్గిపాలు చేస్తానని బెదిరిస్తున్నాడు. హెడ్ మాస్టర్ వేధింపులు తారాస్థాయికి చేరడంతో చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే...
గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలానికి చెందిన ఒక వివాహిత తన దివ్యాంగుడైన తన కుమారుడిని బెల్లంకొండ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో చదివిస్తోంది. వారంలో ఒకరోజు వెళ్లి కొడుకు బాగోగులు విచారించి వస్తోంది. ఈ క్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ కన్ను ఆమెపై పడింది. దీంతో ఒకసారి ఆమెను తన గదికి పిలిపించి నీ కుమారుడు బాగా చదువుతున్నాడని, అయితే నువ్వు నా కోరిక తీర్చితే అతడిని ఇంకా బాగా చదివించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగేలా అండగా నిలుస్తానని చెప్పాడు.
అంతేకాదు నీ కుటుంబానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని మాటలు చెబుతూ ఆమెను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. అయితే తాను చెప్పినట్లు చేయకపోతే నీ కొడుకు భవిష్యత్తు బుగ్గిపాలవుతుందని బెదిరించాడు. అయితే విద్యార్థి తల్లి అతడి బెదిరింపులకు లొంగకపోవడంతో ఆమె కుమారుడు కోసం పాఠశాలకు వచ్చిన ప్రతిసారీ లైంగిక వేధింపుల స్థాయి పెంచాడు. దీంతో బాధితురాలు తన భర్త, అత్తమామలకు ఈ విషయం చెప్పి భోరుమంది. అయితే భర్త నిస్సహాయుడు కావడం, అత్తమామలు పట్టించుకోకపోవడంతో ఆమెపై వేధింపులు తారస్థాయికి చేరాయి.
ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనునాయక్ వేధింపులపై బాధితురాలు ఏపీ మానవ హక్కుల సంఘానికి ఈ నెల 12న ఫిర్యాదు చేసింది. అదేరోజు డీటీడబ్ల్యూవో అధికారి గ్రామంలో ఈ విషయమై విచారణ నిర్వహించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ తన బంధువైన ఓ తహసీల్దారు, స్నేహితుడుతో కలిసి బాధితురాలు ఇంటికి వెళ్లాడు. మర్యాదగా ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
ఈమె వినకపోయేసరికి ఆమె అత్తమామలకు డబ్బు ఆశ చూపి, ఫిర్యాదు వాపసు విషయమై వారి ద్వారా చిత్రహింసలకు గురిచేశాడు. ఆ హింసకు తాళలేక పుట్టింటికి చేరిన బాధితురాలు ఈ నెల 21న బెల్లంకొండ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. హెడ్ మాస్టర్ వేధింపులతో పాటు అత్తమామల నుంచీ తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది.ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు బెల్లంకొండ ఎస్సై డి.జయకుమార్ మీడియాకు తెలిపారు.