బిజెపితో ఉండలేం: టిడిపి నేత, అనూష ఆత్మహత్య.. జైలుకు మాజీ ఎమ్మెల్యే
ఏలూరు/న్యూఢిల్లీ: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం - భారతీయ జనతా పార్టీ మధ్య గొడవ రాజుకుంది. మున్సిపల్ సమావేశంలో టిడిపి, బిజెపి కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.
తాడేపల్లిగూడెంలో నిట్ శంకుస్థాపన విషయంలో టిడిపి - బిజెపిల మధ్య వివాదం తలెత్తిందని తెలుస్తోంది. మున్సిపల్ సమావేశంలో ఇరు పార్టీలక కౌన్సిలర్లు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. బిజెపితో కలిసి ఉండే పరిస్థితి కనిపించడం లేదని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
పొగాకు రైతుల ఆత్మహత్యలు బాధించాయి: సీతారామన్
ఏపీలో పొగాకు రైతుల ఆత్మహత్యలు బాధించాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం చెప్పారు. ఈ నెల 18వ తేదీన ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పొగాకు రైతులను కలుస్తానని ఆమె న్యూఢిల్లీలో తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న రైతులను పరామర్శిస్తామన్నారు. 172 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎవరు కూడా ఆత్మహ్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
బూచేపల్లి సుబ్బారెడ్డికి రిమాండ్
ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని బీవీఎస్సాఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధినేత, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డికి అద్దంకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనను ఒంగోలు ఉపకారాగారానికి తరలించారు. కళాశాల విద్యార్థిని అనూష ఆత్మహత్య కేసులో ఆయనతో పాటు కళాశాల హెచ్ఓడీ మాలకొండా రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది.
చీమకుర్తిలోని ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి ఆమె రాసుకున్న సూసైడ్ నోట్లో ఉన్న అంశాల ఆధారంగా సుబ్బారెడ్డని, కళాశాల హెచ్ఓడీ మాలకొండా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.