నాన్చుడా... తేల్చుడా: అగ్గిరాజుకుంటోంది..జగన్ సమర్థతకు పరీక్ష
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై గత కొద్ది రోజులుగా జోరుగా చర్చ జరుగుతోంది. అమరావతిని తరలిస్తున్నారన్న వార్త అందరినీ కలవరపెడుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. మరోవైపు అమరావతి ముంపు ప్రాంతమంటూ అది రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కాదంటూ కొద్దిరోజుల క్రితం మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. ఇక అప్పటి నుంచి రాజధానిపై చర్చ వాడీవేడీగా మారింది. ఇక రాజధాని విషయంలో విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.
ఇక ప్రత్యక్ష కార్యాచరణ..వైసీపీ దాడుల బాధితులకు అండగా : అక్రమ కేసులు బనాయిస్తున్నారు..చంద్రబాబు..!!
రాజధాని కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో మరోసారి రాజధాని అంశం హాట్టాపిక్గా మారింది. ఎటు చూసినా రాయలసీమ అన్యాయానికే గురైందంటూ కర్నూలులోని రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజధాని పేరుతో చంద్రబాబు సర్కార్ అన్నీ గుంటూరుకే తరలించిందని దీంతో రాయలసీమ ప్రజలకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు రాజధాని ప్రాంతంగా అమరావతి అనువైన ప్రాంతం కాదని శ్రీకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పిన విషయాన్ని విద్యార్థులు ప్రస్తావించారు.
శ్రీబాగ్ ఒప్పందం ఏం చెబుతోంది..?
చాలా కాలం తర్వాత మళ్లీ శ్రీబాగ్ ఒండబడిక తెరపైకి వచ్చింది. ఈ శ్రీబాగ్ ఒప్పందం 16 నవంబరు 1937లో కోస్తాంధ్రా మరియు రాయలసీమ నాయకుల మధ్య జరిగింది. ఇది నాటి ప్రత్యేక ఆంధ్ర కోసం జరిగిన ఉద్యమ సమయంలో జరిగిన ఒప్పందం. ఇది రాయలసీమ ప్రజలకు ఎంతో ముఖ్యమైన ఒప్పందం. రాయలసీమ అభివృద్ధికి ఈ ఒప్పందం నాడు జీవనాడిలా పనిచేసింది. మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్న సమయంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ సమయంలో ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా రాయలసీమ నాయకులను ఆంధ్రా నేతలు కోరారు. అయితే ఆంధ్రా నేతలకు అధికారం వస్తే తమ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుందని భావించిన రాయలసీమనేతలు పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాతే కాశీనాథుని నాగేశ్వర రావు నివాసంలో ఇరు ప్రాంత నేతల మధ్య ఓ ఒప్పందం జరిగింది. దాన్నే శ్రీబాగ్ ఒప్పందంగా పిలుస్తున్నాము.
శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలేమిటి..?
దీని ముఖ్య ఉద్దేశం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అంటూ జరిగితే రాజధాని , హైకోర్టు ఎక్కడ ఉండాలన్నది రాయలసీమ ప్రాంత ప్రజలు నిర్ణయిస్తారనేది ముఖ్యాంశం. ఆ సమయంలో హైకోర్టు కోస్తాంధ్రా ప్రాంతంలో ఉండాలని నిర్ణయించారు. ఇప్పుడు రాజధాని కోసం రోడ్డెక్కిన రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థులు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా లేని పక్షంలో కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నాన్చుతుందా లేక తెంచుతుందా..?
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు కూడా రాజధాని కోసం గళమెత్తుతున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రాజధానిని విశాఖపట్నంలో ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. మరోవైపు కర్నూలులోనే రాజధాని ఏర్పాటు చేయాలంటూ ఆ జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఇక తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయాలంటూ మాజీ ఎంపీ చింతామోహన్ వాదిస్తున్నారు. ఇక బొత్స రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేయడంతో అగ్గి రాజుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా తమ ప్రకటనలతో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుండటంతో జగన్కు తలనొప్పింగా మారింది వ్యవహారం. అయితే జగన్ మాత్రం వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపుతారా..లేక తెగేదాకా నాన్చుతారా అనేది ఆసక్తికరంగా మారింది.
మరో ఉద్యమం తప్పదా..?
రాజధాని కోసం ఒక్కసారి ఉద్యమం ప్రారంభమైందంటే పరిస్థితి మరోలా మారుతుంది. అది సీఎం జగన్కు కచ్చితంగా తలనొప్పి వ్యవహారమే అవుతుంది. ఇప్పుడిప్పుడే పాలనపై పట్టు సాధిస్తున్న క్రమంలో ఆయా రాజకీయపార్టీలు రాజధాని రగడను తెరపైకి తీసుకురావడంతో ఏపీలో మరో ఉద్యమం వస్తుందా అన్న అనుమానాలు మెదులుతున్నాయి. అంతేకాదు ఉద్యమాలు విద్యార్థుల చేతుల్లోకి వెళ్లాయంటే పరిణామాలు ఎక్కడి నుంచి ఎటువైపు మరలుతాయో చరిత్ర చూస్తే తెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.