1956కు ముందే: బాబుకు కేసీఆర్ 'సింగపూర్' కౌంటర్
హైదరాబాద్: 1956కు ముందే తెలంగాణలో స్థిరపడిన వారి పిల్లలకే బోధనా రుసుములు చెల్లించాలని తెలంగాణ మంత్రి మండలి నిర్ణయించుకుంది. మంత్రి మండలి సుదీర్ఘ భేటీ అనంతరం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్థానంలో ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ పథకం అమలు చేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణలో 1956కు ముందు స్థిరపడిన వారికి మాత్రమే ఫీజు రీయింబర్సుమెంట్స్ వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఆంధ్ర విద్యార్థులకు వర్తించదని, సింగపూర్ లాంటి రాజధానిని నిర్మించుకుంటామన్న వారు విద్యార్థుల ఫీజులు చెల్లించలేరా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి కేసీఆర్ అన్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి రాష్ట్ర సలహా మండలి ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్టస్థ్రాయి కమిటీ ఏర్పాటు అయిన తర్వాత ఇలాంటి కమిటీలను జిల్లా స్థాయిలోనూ ఏర్పాటు చేయన్నుట్టు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఏర్పాటుకు, గవర్నర్ కోటాలో భర్తీ కావాల్సిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి నల్గొండ జిల్లాకు చెందిన కర్నే ప్రభాకర్ను మంత్రివర్గం ఎంపిక చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఎస్టీలకు, మైనార్టిలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై అధ్యయనం చేయడానికి హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో కమిటీ వేయడానికి కూడా మంత్రి వర్గం ఆమోదించిందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో భూ కబ్జాదారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. భూములన్నింటినీ సర్వే చేయించి ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే తిరిగి స్వాధీనం చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు.