సెల్ఫీతో చావు ఒడిలోకి...గోదావరి నదిలో పడిపోయిన ఇద్దరు విద్యార్థినులు
పశ్చిమ గోదావరి: ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా జనాలను సెల్ఫీల పిచ్చి వదలడం లేదు. తాజాగా ఇలాగే సెల్ఫీ మోజులో ఒక విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా మరో విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల్లోకి వెళితే...
పశ్చిమగోదావరి జిల్లా పట్టిసీమ ప్రాజెక్ట్ ను చూసేందుకని కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సాయిరమ్య అనే విద్యార్ధిని తన స్నేహితురాలితో కలిసి అక్కడకు వెళ్లింది. ఆ ప్రాజెక్ట్ వద్ద వీరు సెల్ఫీలు దిగుతూ అడ్డుకట్ట దాటి నదికి మరీ చేరువలోకి వెళ్లడంతో ఒకరితర్వాత ఒకరు ఇద్దరూ గోదావరి నదిలో పడిపోయారు.
వీరు నదిలో పడటం చూసిన స్థానికులు రక్షించేందుకని వెంటనే నీళ్లలోకి దూకినా సాయిరమ్య స్నేహితురాలినైతే కాపాడగలిగారు గానీ అప్పటికే సాయిరమ్మ ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. దీంతో సాయిరమ్య గల్లంతు కాగా ఆమె స్నేహితురాలు అప్పటికే బాగా నీళ్లు మింగేయడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన సాయి రమ్య ఆచూకి కోసం గాలింపు జరుపుతున్నారు.