బాలురతో మద్యం తాగించిన వాచ్మెన్...చిన్నారిపై లైంగిక దాడి
కడప:జిల్లాలోని సుండుపల్లి గిరిజన వసతి గృహానికి చెందిన ఇద్దరు బాలురతో వాచ్మెన్ మద్యం తాగించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ వసతి గృహానికి వాచ్మెన్గా ఉన్న వ్యక్తి తాను మద్యం తాగుతూ పదేళ్ల వయస్సున్న ఇద్దరు విద్యార్థులకు తాగించాడు.
ఈ విషయం బైటకు పొక్కడంతో వాచ్మెన్ను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లాకు చెందిన గిరిజన నాయకులు సోమవారం వసతిగృహం ముందు ధర్నాకు దిగారు. వాచ్మెన్ను సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కడప పట్టణంలో ఎనిమిదేళ్ల బాలుడిపై 30 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసు కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే...
సుండుపల్లి మండల కేంద్రం సమీపంలో ఉన్న ఎస్టీ గురుకుల పాఠశాలలో ఇద్దరు మూడవ తరగతి విద్యార్థులకు వాచ్ మెన్ మద్యం తాగించారని, ఇందుకు బాధ్యులుగా ఆ వాచ్ మెన్ తో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు వార్డెన్ ను కూడా సస్పెండ్ చేయాలంటూ ఎపి బంజారా సంఘం నాగేంద్ర నాయక్ డిమాండ్ చేశారు. అంతకుముందు ఎపి బంజారా సంఘం ఆధ్వర్యంలో ఎస్టీ గురుకుల పాఠశాల నుంచి విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు సుబ్బరామయ్య వినతిపత్రం అందచేశారు. ఘటనపై పోలీసులచే విచారణ జరిపించి చర్యల కోసం ఉన్నతాధికారుల కోసం పంపుతామని తహసీల్దార్ సుబ్బరామయ్య చెప్పారు.
మరోవైపు కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండో తరగతి చందువుతున్న ఎనిమిదేళ్ల బాలుడిపై రాగి మల్లేష్(30) అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసు కేసు నమోదైంది. బాలుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ పురుషోత్తంరాజు తెలిపారు. సిఐ కథనం ప్రకారం కడప నగర శివారులోని సరోజనీనగర్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు సోమవారం బహిర్భూమికి వెళ్లాడు. అదే ప్రాంతానికి చెందిన రాగి మల్లేష్ నీకు చాక్లెట్ ఇస్తానంటూ పొదల్లోకి తీసుకు వెళ్లి బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లగా, తండ్రి ఏం జరిగిందో తెలుసుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.