నిషాలో జోగుతున్న విజయవాడ శివారు కళాశాలలు,యూనివర్సిటీలు ... నిషేధిత ఈ సిగరెట్లు కూడా ..
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఒక్క డ్రగ్స్ మాత్రం కాదు ఎన్ని రకాల వ్యసనాలు ఉంటాయో అన్ని రకాల వ్యసనాలకు యువత బానిసలుగా మారుతున్నారు. ముఖ్యంగా ఏపీ రాజధాని పరిసర ప్రాంతాల్లోని కళాశాలలు, యూనివర్సిటీలు అడ్డాగా డ్రగ్స్ దందా కొనసాగుతుంది. గంజాయి, కొకైన్, ఎండీఎం వంటి మాదక ద్రవ్యాలే కాక, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఈ సిగరెట్స్ దందా కూడా ఇక్కడ జోరుగా జరుగుతుంది. నిషా మత్తులో విద్యార్థులను దించటమే లక్ష్యంగా కొందరు వీరికి డ్రగ్స్,నిషేధిత ఈ సిగరెట్లు, గంజాయి అందిస్తున్నారు . చాపకింద నీరులా డ్రగ్స్ మాఫియా తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది.
ఏపీలో విచ్చలవిడిగా గంజాయి దందా.. రెండు రోజుల్లో 670 కేజీలు సీజ్
విజయవాడలో టాస్క్ ఫోర్స్ దాడులు .. వెలుగులోకి ఈ సిగరెట్ల దందా
ఈ-సిగరెట్ లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ రాజధాని నగరం విజయవాడలో వీటి అమ్మకాలు, కొనుగోళ్లు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కళాశాలల విద్యార్థులకు, యూనివెర్సిటీల విద్యార్థులకు ఈ సిగరెట్స్ పెన్స్ రూపంలో అందిస్తున్నారు. తాజాగా విజయవాడ నగరంలోని ఓ కళాశాలలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడిచేయగా ఈ సిగరెట్ల విన్యోగం ఎంతగా ఉందో ఒక్కసారిగా వెలుగుచూసింది. విద్యార్థులు గంజాయితోపాటు వీటిని కూడా వినియోగిస్తున్నట్లు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది.
గతంలోనూ పలు మార్లు పట్టుకున్న ఈ సిగరెట్లు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ సిగరెట్స్ తయారీ, దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, నిల్వ, పంపిణీ, ప్రచారం అన్నిటిపైనా నిషేధం అమలులో ఉంది. కానీ విజయవాడ నగరంలో చాపకింద నీరులా ఈ-సిగరెట్ విక్రయాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులు గతంలో ఆగస్ట్ మాసంలో జరిపిన తనిఖీలలో రూ .10 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక తాజాగానూ పెద్ద ఎత్తున ఈ సిగరెట్స్ మార్కెట్ లో లభిస్తున్నాయి అని తాజా టాస్క్ ఫోర్స్ దాడుల ద్వారా తెలుస్తుంది.
ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థులే టార్గెట్
విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న ఇంజినీరింగ్, స్వయంప్రతిపత్తి విశ్వవిద్యాలయాల్లోనూ ఇప్పటికే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ మత్తులో జోగుతున్నారు. ఇటీవల కాలంలో కిలోల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. అంతే కాదు ఎండీఎం వంటి మాదక ద్రవ్యాలను సైతం పట్టుకున్నారు. విచారణలో ఇది విద్యార్థుల కోసం రవాణా చేసినట్లుగా తేలింది.ఇక ఇవి చేరవేస్తుంది కూడా విద్యార్థులే అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు తాజాగా ఈ-సిగరెట్ విక్రయాలు, వినియోగం కూడా సాగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ సిగరెట్లకు, గంజాయికి అడిక్ట్ అవుతున్న విద్యార్థులు
సాధారణ సిగరెట్లే కాదు ఈ సిగరెట్లు సైతం క్యాన్సర్ కారకాలని , ఏ విధంగా వీటిని వినియోగించినా ఊపిరితిత్తులు పాడవుతాయని , ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్న ఈ సిగరెట్లు బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్న కేంద్రం వీటిపై బ్యాన్ విధించింది. కానీ విజయవాడ శివారు కాలేజీల విద్యార్థులు వీటికి చాలా అడిక్ట్ అవ్వటంతో ఇంకా వీటిని సీక్రెట్ గా వినియోగిస్తున్నారు. ఇక ఇప్పుడు టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లో ఈ విషయం వెలుగులోకి రావటంతో ఈ సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు చేసే పనిలో ఉన్నారు.