టాలీవుడ్కి రాజధాని అమరావతి సెగ.. ఫిలిం ఛాంబర్ వద్ద రైతులు, విద్యార్థుల ఆందోళన
రాజధాని అమరావతి కోసం పోరాటం కొనసాగుతుంది. రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాజధాని అమరావతికి సినీ ప్రముఖులు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వారికి సీపీఎం నేతలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా రాజధాని రైతులు 53 రోజులుగా పోరాటం చేస్తున్నారని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు వినతిపత్రం సమర్పించారు.
హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అమరావతి కోసం విద్యార్ధి జేఏసీ ధర్నా
అమరావతి రైతుల నిరసనకు టాలీవుడ్ హీరోలు సహకారం అందించాలని డిమాండ్ చేస్తూ అమరావతి పరిరక్షణ విద్యార్ధి యువజన జెఎసి నేతృత్వంలోని నిరసనకారులు శనివారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కోసం మూడు రాజధానుల వైయస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత 53 రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా మాట్లాడాలని జెఎసి నాయకులు తెలుగు హీరోలను కోరారు.
అమరావతి రైతుల నిరసనకు టాలీవుడ్ హీరోలు సహకారం అందించాలని డిమాండ్
ఏపీలో గత యాభై రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోందని, ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఇక అమరావతి రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ నుండి ప్రజల తరఫున నిలబడే బాధ్యతను కవులు, కళాకారులు, సాంస్కృతిక బృందాలు తీసుకోవాలని, అందుకే, సినీ పరిశ్రమను కూడా మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా సినీ పరిశ్రమ సహకారం కావాలని వినతి
ఏపీలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు సీపీఐ రామ కృష్ణ . ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.రాజధానిని తరలించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నామని చెప్పారు. సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తోంది కనుక తమ అండగా నిలబడమని కోరుతున్నామని అన్నారు.