ప్రసంగం అడ్డుకున్నారు, ఆగ్రహించిన బాబు, మా మధ్య చిచ్చుపెట్టాలని: వెంకయ్య
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని డిస్సీ అభ్యర్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం జిల్లా సోమందేవపల్లిలో చంద్రబాబు నిర్వహించిన సభలో డిఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు.
ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్సీ అభ్యర్థుల పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా గొడవ చేస్తే మీ సమస్యలు పరిష్కరించడం ఎలా అన్నారు. ఏపీలో 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు.
ఏపీకి సోలార్ ప్లాంట్ కూడా వస్తోందన్నారు. ఏపీకి ఇప్పటికే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందన్నారు. భారత దేశంలో నదుల అనుసంధానం చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. రాష్ట్రంలో పండ్ల తోటల కోసం డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ చ్చామన్నారు.
హంద్రీనీతో జిల్లాలోని ప్రతి చెరువుకు నీరు అందిస్తామని చెప్పారు. ఇక్కడ మంచి భూమి, వాతావరణం, ప్రజలు ఉన్నారన్నారు. విభజన తర్వాత మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయని చెప్పారు.
ఐనా, రైతుల కష్టాలు చూసి రుణవిముక్తి చేశామన్నారు. డ్వాక్రా సంఘాలకు భారీగా రుణాలు ఇస్తున్నామన్నారు. నాకు అనంతపురం అంటే ప్రత్యేకమైన అభిమానం అన్నారు. టిడిపిని ఎప్పుడూ ఇక్కడ ఆదరిస్తూనే ఉన్నారని చెప్పారు.
మరిన్ని ప్రాజెక్టులు: వెంకయ్య
ఏపీలో త్వరలో మరిన్ని ప్రాజెక్టులు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ, ఐఐటీ వచ్చాయన్నారు. బిజెపి, టిడిపి మధ్య విభేదాలకు చాలామంది ప్రయత్నిస్తున్నారన్నారు. రాజధాని అమరావతిలో 186 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకుకేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ఏపీలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం ఆలోచిస్తోందన్నారు.