జగన్ అంటే అంత భయమెందుకు?: బాబుపై సుబ్బరాయుడు, అనంత ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటే టిడిపి అధినేత చంద్రబాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం నేతలు తెలంగాణ ఏసిబికి పట్టుబడ్డారని, ఈ కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధమేంటని నిలదీశారు.
టిడిపి తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలని, తప్పు చేయకుంటే చేయలేదని నిరూపించుకోవాలని సుబ్బరాయుడు సూచించారు.
ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, తెలుగు ప్రజల పరువు తీసిన టిడిపి నాయకుల వైఖరిని తప్పుట్టినందుకు.. వైయస్ జగన్ దిష్టిబొమ్మలను టిడిపి నేతలు దగ్ధం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇది సరైన విధానం కాదని టిడిపి నేతలపై మండిపడ్డారు. ఏపి ప్రభుత్వం మొత్తం ఓటుకు కోట్లు కేసు చుట్టూ తిరుగుతోందని, రైతు, ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందని సుబ్బరాయుడు, అనంతవెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.