తిరుమల డిక్లరేషన్పై సుబ్బారెడ్డి వ్యాఖ్యల వక్రీకరణ- చంద్రబాబు మీడియా పనే అన్న స్వామి
రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి రానున్నారు. శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అయితే స్వతహాగా క్రిస్ట్రియన్ అయిన ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు తనకు విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇవ్వాలా వద్దా అన్న దానిపై రాష్ట్రంలో తీవ్రంగా చర్చ సాగుతోంది. గతంలో డిక్లరేషన్ ఇవ్వకపోయినా ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏపీలో ఉచిత విద్యుత్ మీటర్ల గుట్టు విప్పిన హరీష్ రావు- ఆ 4 వేల కోట్ల కోసమే జగన్.. !
జగన్ ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆయన బాబాయ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆయనకు మద్దతుగా నిలిచారు. టీటీడీ ఛైర్మన్ వ్యాఖ్యలను చంద్రబాబు అనుకూల మీడియా వక్రీకరించిందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు ఆధ్వర్యంలోని మీడియా సుబ్బారెడ్డి వ్యాఖ్యలను తప్పుగా ప్రచురించిందని స్వామి విమర్శించారు. దీంతో ఇప్పుడు స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తిరుమల వచ్చే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనేది అబద్ధమని స్వామి తెలిపారు. అదంతా మీడియా వక్రీకరణే అన్నారు. టీటీడీ నిధులపై కాగ్ దర్యాప్తుకు భయపడి చంద్రబాబు తన అనుకూల మీడియాలో ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేస్తున్నారని స్వామి ఆరోపించారు. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతీ భక్తుడినీ టీటీడీ ప్రత్యేకంగా ప్రశ్నించదని సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు.