తిరుమల విషయం తేల్చేందుకు హైదరాబాద్కు సుబ్రహ్మణ్యస్వామి, హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్/అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధుల దుర్వినియోగంపై హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. టీటీడీని రాష్ట్ర ప్రభుత్వం ఆదీనం నుంచి తప్పించాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఏపీలో మారుతున్న సమీకరణాలు, బాబును గెలవనీయను, జగన్ గెలిచే ప్రసక్తి లేదు: పవన్ కళ్యాణ్
తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలపై విచారణ జరిపించాలని కోరారు. అంతకుముందు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని కూడా వెల్లడించారు.
ఈ రోజు తాను హైదరాబాదులో ఉన్నానని, న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న సత్యా సభర్వాల్తో కలిసి తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశానని, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతున్నామని, దేవాలయ నిధులు దుర్వినియోగం పైనా విచారణకు డిమాండ్ చేస్తున్నామని, కేసు విచారణ తేదీ త్వరలో వస్తుందని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు.
తిరుమల దేవాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధి నుంచి తప్పించాలని సుబ్రహ్మణ్య స్వామి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈ విషయం స్థానిక అంశం కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టుకు వెళ్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు.
కుట్రలో భాగంగానే: టీడీపీ ఎంపీ రవీంద్రబాబు
టీటీడీని రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతూ హైకోర్టులో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి రిట్ పిటిషన్ దాఖలు చేయడంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ స్పందించారు. కుట్రలో భాగంగానే సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారన్నారు. న్యాయపరంగానే సమర్ధంగా ఎదుర్కొంటామన్నారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం, రోస్టర్ విధానంలోనే హైకోర్టులో నియామకాలు చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశాలపైనా కూడా హర్షం వ్యక్తం చేశారు. రోస్టర్ విధానంలోనే న్యాయాధికారుల విభజన జరగాలన్న హైకోర్టు తీర్పునే సుప్రీం బలపరిచిందన్నారు. అవరోధాలు లేకుండా అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైందన్నారు.
{document1}