అయోధ్య రామమందిర నిర్మాణ తేదీ ప్రకటించిన సుబ్రమణ్యస్వామి: టీటీడీపై కీలక వ్యాఖ్యలు
తిరుపతి: అయోధ రామమందిర నిర్మాణంపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. రామమందిర నిర్మాణ ప్రారంభ తేదీపై స్పష్టతనిచ్చారు. మరో మూడు నెలల్లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుందని సుబ్రమణ్యస్వామి ప్రకటించారు.
జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలు
అయోధ్య రామమందిరానికి భూమి పూజ..
2020, ఏప్రిల్ 2వ తేదీన అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తామని స్పష్టం చేశారు. 2022 నాటికి రామమందిర నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
రామ జన్మభూమి, కృష్ణ జన్మభూమి, కాశీ విశ్వనాథ ఆలయం అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యాలని చెప్పారు. శరవేగంగా అయోధ్య రామాలయాన్ని నిర్మించి.. దగ్గరలో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ్నుంచి రామేశ్వరం సర్వీసులు పెట్టి రామసేతు దర్శించేలా చేస్తామని వివరించారు. రాముడు నడయాడిన ప్రాంతాలన్నీ మళ్లీ ప్రజలకు సాక్షాత్కారింపజేయడమే తమ లక్ష్యమన్నారు.
రామసేతు నిర్మాణం జాతికి గర్వకారణం
తమిళనాడులోని రామసేతు విషయంలో అప్పటి సీఎం కరుణానిధి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కక్షపూరితంగా వ్యవహరించారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించి వారి చర్యలను తిప్పికొట్టామని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు రామసేతు నిర్మాణం జాతికి గర్వకారణమని చెప్పారు.
చాలా శక్తులు అడ్డుకుంటున్నాయి..
హిందూ ధర్మ పరిరక్షణలో తమను అడ్డుకుంటున్న శక్తులు చాలా ఉన్నాయన్న సుబ్రమణ్యస్వామి.. అవన్నీ విదేశాల నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని తెలిపారు. సామూహిక మత మార్పిడులను అడ్డుకుంటామన్నారు. సర్వధర్మ సమాభావం తమ సిద్ధాంతమని తెలిపారు. సామూహికంగా మతాన్ని మార్చేసే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదని చెప్పారు. దేవాలయాలకు వచ్చిన డబ్బును హజ్ యాత్రకు ఎలా ఇస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. వందల ఏళ్లుగా దేవాలయాల బాధ్యత చూస్తున్న ప్రభుత్వాలు.. వాటి అభివృద్ధిని గాలికి వదిలేశాయని ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
ఇటాలియన్ కాంగ్రెస్ అంటూ..
భారత జాతీయ కాంగ్రెస్ ఇప్పుడు లేదని.. ఇప్పుడు ఇటాలియన్ కాంగ్రెస్ ఉందన్నారు. ప్రాణ భయంతో దేశానికి వచ్చిన యూదులను అక్కున చేర్చుకున్న దేశం మనదని చెప్పారు. అలాంటి మన దేశ లౌకికవాదంపై ఇప్పుడు పాకిస్థాన్ లాంటి దేశాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మొదట భారతీయులం.. ఆ తర్వాతే హిందువులమని అన్నారు. అన్ని మతాల ప్రజలు దేశ సంస్కృతికి భంగం కలిగించకుండా స్వేచ్ఛగా జీవించవచ్చని సుబ్రమణ్యస్వామి అన్నారు.
తిరుమల ఆదాయంపై కాగ్ విచారణ..
ఇక తిరుమల శ్రీవారి ఆలయం గురించి మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో స్వామి వారి ఆదాయ ఆడిట్ వివరాలను కోర్టు ముందుంచాలని అన్నారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి సరిగా లేదన్నారు. వందేళ్లుగా వస్తున్న కానుకలపై ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఎలా ఆడిచేస్తారని.. అంతా సవ్యంగానే ఉందని ఎలా ధృవీకరిస్తారని సుబ్రమణ్మస్వామి ప్రశ్నించారు. టీటీడీకీ గత ఐదేళ్లలో వచ్చిన కానుకలు, డబ్బుపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని.. కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)కి టీటీడీ ఆడిట్ బాధ్యతలు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం(టీటీడీ) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ జోక్యం నుంచి బయటడాలని, రాష్ట్ర ప్రభుత్వ పెత్తనాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఆలయ నిర్వహణ స్వర్ణదేవాలయం తరహాలో స్వతంత్రంగా జరగాలని అన్నారు.