జగన్ సర్కారుపై ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు: రాహుల్, ప్రియాంకపై తీవ్ర విమర్శలు
తిరుపతి: తిరుమలలో అన్యమత ప్రచారం, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారుపై వస్తున్న విమర్శలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
జగన్ సర్కారుపై ఆరోపణలు అవాస్తవం..
అనంతరం ఆలయం వెలుపల సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంకు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే ప్రశ్నిస్తానని అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదంటూ..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సుబ్రమణ్యస్వామి ఖండించారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలేనని అన్నారు. అంతేగాక, హిందూ విశ్వాసాలను గౌరవించేలానే జగన్ సర్కారు చర్యలు ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మున్ముందు మంచి ఫలితాలు ఆశించవచ్చని అన్నారు .
తిరుమల కానుకల లెక్కింపునకు పటిష్ట చర్యలు
టీడీపీ ప్రభుత్వం రిటైర్మెంట్ పేరుతో తిరుమల ప్రధాన అర్చకుడిని తొలగించిందని.. ఆయనను జగన్ ప్రభుత్వం మళ్లీ ప్రధాన అర్చకుడిగా నియమించడం శుభపరిణామమని సుబ్రమణ్యస్వామి అన్నారు. తిరుమల స్వామివారి కానుకల లెక్కింపునకు సంబంధించి పటిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు. ఆదాయ, వ్యయాల ఆడిట్ నిర్వహించాలన్నారు.
ప్రియాంక గాంధీ వాద్రాపై కేసు పెట్టాలి..
ఇది ఇలావుంటే, రాహుల్ గాంధీ కుటుంబంపై సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాహుల్ కుటుంబం ఫాసిస్ట్ ఫ్యామిలీ అని, సోనియా తండ్రి హిట్లర్ అని.. ఆర్మీలో సైనికుడిగా ఉండి రష్యాపై దాడి చేశారని అన్నారు. అంతేగాక, ప్రియాంక గాంధీ వాద్రా పోలీసులపై దాడి చేశారని, ఆమెపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మోడీ ప్రభుత్వం చేసిచూపిస్తోంది..
సీఏఏ చట్టం.. మతపరమైన ఇబ్బందుల కారణంగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన 30వేల మంది హిందువులు, పార్శీలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, తదితర మైనార్టీల కోసమేనని సుబ్రమణ్యస్వామి చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఒక్క ముస్లిం కూడా మతపరమైన ఇబ్బందుల వలన వలస రాలేదన్నారు. ఎన్ఆర్సీ అమలు చెయ్యమని రాజీవ్ గాంధీ హయాంలో సుప్రీంకోర్టు ఆదేశించిందని.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. ప్రస్తుతం మోడీ ప్రభుత్వం చేసి చూపిస్తోందని ఆయన అన్నారు.