రోగికి 'బిగ్బాస్ షో' చూపిస్తూ... ఏపీలో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ...
గుంటూరు వైద్యులు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు విజయవంతంగా అవేక్ బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు. అవేక్ బ్రెయిన్ సర్జరీ అంటే... రోగి మెలుకవతో ఉండగానే మెదడు భాగంలో చేసే శస్త్ర చికిత్స. క్లిష్టమైన ఈ ఆపరేషన్ను అత్యాధునిక న్యూరో నావిగేషన్ వైద్య విధానంలో విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ ఇదేనని వైద్యులు చెప్తున్నారు. గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డా.హనుమ శ్రీనివాసరెడ్డి ఈ సర్జరీ వివరాలను శుక్రవారం(నవంబర్ 20) మీడియాకు వెల్లడించారు.
మెదడులో ట్యూమర్...
డా.హనుమ శ్రీనివాసరెడ్డి కథనం ప్రకారం... గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన బత్తుల వరప్రసాద్(33) బెంగళూరులో స్టాఫ్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2016 నుంచి వరప్రసాద్ మెదడు సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. దాంతో తరుచూ అతనికి ఫిట్స్ వస్తున్నాయి. మొదట్లో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకోగా.. బ్రెయిన్లో ట్యూమర్ ఏర్పడినట్లు గుర్తించి సర్జరీ చేశారు.
మళ్లీ అదే సమస్య...
హైదరాబాద్లో సర్జరీ చేయించుకున్న కొన్నాళ్లకు మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. తరుచూ ఫిట్స్ వచ్చి పడిపోతుండటంతో.. ఈసారి గుంటూరు వైద్యులను సంప్రదించాడు.కొత్తపేటలోని బ్రింద న్యూరో సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వరప్రసాద్ బ్రెయిన్లో మళ్లీ ట్యూమర్ ఏర్పడినట్లు ఆ పరీక్షల్లో వెల్లడైంది. పెద్ద రక్తనాళం పక్కన ప్రీ మోటార్ ప్రాంతంలో ట్యూమర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
Recommended Video
మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ...
ఈ నెల 10న న్యూరో నావిగేషన్ విధానంలో మోడ్రన్ మైక్రోస్కోప్ వినియోగించి బృంద ఆస్పత్రి వైద్య బృందం వరప్రసాద్కు శస్త్రచికిత్స నిర్వహించింది. ఇందుకోసం త్రీడీ టెక్నాలజీ కూడా ఉపయోగించుకున్నారు. రోగి మెలుకువతో ఉండగానే... అతనికి తెలుగు బిగ్ బాస్ షో చూపిస్తూ సర్జరీ పూర్తి చేశారు. అదే సమయంలో అతనికి ఇష్టమైన అవతార్ సినిమా కూడా చూపించారు. సర్జరీ సమయంలో రోగి పాటలు కూడా పాడటం విశేషం. సుమారు గంటన్నర పాటు జరిగిన శస్త్ర చికిత్సలో మూడు సెంటిమీటర్ల ట్యూమర్ను తొలగించారు. ఈ శస్త్ర చికిత్సలో సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ డి.శేషాద్రిశేఖర్, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ బి.త్రినాథ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇదే మొట్టమొదటి అవేక్ బ్రెయిన్ సర్జరీ అని తెలిపారు.