చలికి గజగజ: ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరింత పడిపోయే ఛాన్స్!
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోయాయి.
హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లలో ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోయాయి. చలి తీవ్రతతో ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పట్టణాలు కూడా వణికిపోతున్నాయి. సాయంత్రం మొదలవుతున్న చల్లటి ఈదురుగాలులు ఉష్ణోగ్రతలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
ఈ సీజన్ లో ఒక్కసారిగా ఇలా ఉష్ఱోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఐదారు రోజుల క్రితం సగటు ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలుగా ఉండగా.. ఇప్పుడది రాత్రి పూట 16 నుంచి 17 డిగ్రీలకు పడిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు కూడా దారుణంగా పడిపోయాయి. పగటిపూట 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక చలి ఉండే ప్రాంతమైన అరుకు లోయలో ఉష్ణోగ్రత 12 డిగ్రీలకు పడిపోయింది. మోదకొండమ్మ పాదాలు, బొర్రా గుహలు తదితర ప్రాంతాల్లో ఉదయం 9 గంటలు దాటుతున్నా సూర్యుడు కనిపించని పరిస్థితి.
పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రహదారులపై రాకపోకలకూ అంతరాయం తప్పడం లేదు. బుధవారం రాత్రి హైదరాబాద్ లో 18 డిగ్రీలు, విజయవాడలో 20 డిగ్రీలు, విశాఖపట్నంలో 21 డిగ్రీలు, నిజామాబాద్ లో 17 డిగ్రీలు, అరకులో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కాశంలో మేఘాలు లేక నిర్మలంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.