"జూ.ఎన్టీఆర్, హరికృష్ణ ఎక్కడున్నారు, లోకేష్ వారసుడా?"
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కుట్రను దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అభిమానులు ఎన్నటికీ మరిచిపోలేరని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అన్నారు.
చంద్రబాబు చేసిన దుర్మార్గంతో ఎన్టీ రామారావు అభిమానులు నిత్యం ఏడుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును దొంగ అన్న మాటలు ఎన్టీఆర్ వీడియోలో ఉన్నాయని ఆయన అన్నారు.
వారిద్దరు ఎక్కడ
నందమూరి వారసులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడున్నారని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ఆ వంశం నుంచి రాజకీయ వారస్తవం ఎందుకు రావడం లేదని అడిగారు. రాజకీయ విలువలు ఉంటే చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలని ఆయన అన్నారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులతో రాజీనమా చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
Recommended Video
నారా లోకేష్ వారసుడా....
చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ టిడిపికి వారసుడా అని సుధాకర్ బాబు ప్రశ్నించారు దమ్ముంటే నారావారి పార్టీ అని పెట్టి రెండు సీట్లు గెలిచి చూపించాలని ఆయన చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు తన అనుకూల మీడియా ద్వారా తిమ్మిని బమ్మిని చేస్తున్నారని ఆయన అన్నారు.
ఆయన గుడ్డి ముఖ్యమంత్రి...
ఎపిని ఓ గుడ్డి ముఖ్యమంత్రి పాలిస్తున్నారని సుధాకర్ బాబు అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం ఎపి దౌర్భాగ్యమని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు ఎప్పుడు తీరుస్తారని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబువి కుట్ర రాజకీయాలు
చంద్రబాబు కుట్ర రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యాయని సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు చేతిలో మోస పోయేందుకు రాష్ట్ర ప్రజలు సిద్దంగా లేరని అన్నారు. ఎన్డీఎతో భుజం భుజం కలిపి తిరిగింది ప్రజలు మరిచిపోరాని, అందుకే ఎదుటివారిపై బురద చల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.
వారు నేరగాళ్లు కారా...
టిడిపి నాయకులు సుజనా చౌదరి, దీపక్ రెడ్డి ఆర్థిక నేరగాళ్లు కారా అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాదు నుంచి ఎందుకు పారిపోయి వచ్చారని ఆయన చంద్రబాబును అడిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో చంద్రబాబుకు ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో తెలియడం లేదని అన్నారు. కేసీఆర్తో కుమ్మక్కయి రాజకీయలు నేర్చకోవాలా అని ప్రశ్నించారు.