ఎట్టకేలకు అరెస్ట్ చేశారు: చిక్కిన నెల్లూరు బురిడీ మహరాజ్ బాబా..
నెల్లూరు: నెల్లూరుకు చెందిన బురిడీ బాబా సుధాకర్ మహరాజ్ను ఎట్టకేలకు నెల్లూరు రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
తెర వెనుక ఏం జరుగుతోంది?: బురిడీ బాబాను తప్పించే వ్యూహమా..
నెల్లూరులోని మైపాడుగేట్ ప్రశాంతినగర్ వద్ద సుధాకర్ ఆశ్రమం ఉందని పోలీసులు తెలిపారు. ఇందులో 108 రోజుల యాగం ఒకటి నిర్వహిస్తున్నట్టు భక్తులకు ప్రచారం చేశారు. ఆ యాగంలో పాల్గొంటే అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని నమ్మబలికారు.
ఈ నెపంతో భక్తుల ఆధ్యాత్మిక బలహీనతను దండిగా క్యాష్ చేసుకున్నారు. యాగంలో పాల్గొన్నవారికి మంత్రపీఠికలు ఇస్తామని చెప్పడంతో.. లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి మరీ యాగానికి సిద్దమైపోయారు. సుమారు రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన సుధాకర్.. ఆ తర్వాత మోసం బయటపడటంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఇదే క్రమంలో కొద్దిరోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు సుధాకర్. అయితే ఇది డ్రామానా? నిజమా? అన్న సందేహాలు కలిగాయి. ఆపై సింహపురి ఆసుపత్రిలో చేరిన సుధాకర్.. తన మనుషులను అడ్డుగా పెట్టుకుని పోలీసులను దగ్గరికి రానివ్వలేదు.
ఈ నేపథ్యంలో బుధవారం సుధాకర్ మహరాజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతున్న విషయం తెలుసుకుని నెల్లూరు రూరల్ సీఐ పి.శ్రీనివాసరెడ్డి సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సుధాకర్ మహరాజ్కు సహకరించిన ఆశ్రమ నిర్వాహకులు నాగవాసవి, మరికొందరు పరారీలో ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.