తెర వెనుక ఏం జరుగుతోంది?: బురిడీ బాబాను తప్పించే వ్యూహమా..
నెల్లూరు: ఆధ్యాత్మిక ముసుగులో కోట్ల రూపాయాల మోసానికి పాల్పడిన సుధాకర్ మహరాజ్ అనే బురిడీ బాబా ఉదంతం నెల్లూరులో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. యాగాల పేరిట కోట్లు వసూలు చేసిన సుధాకర్ మహరాజ్పై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అతని అరెస్టుకు అంతా సిద్దమైంది.
కానీ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సుధాకర్ మహరాజ్.. హైడ్రామా మొదలుపెట్టాడు. ఆత్మహత్య డ్రామాకు తెరలేపి సింహపురి ఆసుపత్రిలో చేరిన అతను.. పోలీసులను దగ్గరికి రానివ్వడం లేదు. దీంతో కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతోంది.
బురిడీ బాబా.. కిలాడి లేడీ, వెలుగులోకి ఆసక్తికర విషయాలు!
ఇదీ మోసం:
నెల్లూరులోని ప్రశాంతినగర్లో ఉన్న సుధాకర్ మహరాజ్ ఆశ్రమంలో ఇటీవల రూ.3.72కోట్ల స్కామ్ ఒకటి వెలుగుచూసింది. మంత్ర పీటం పేరిట 262మంది భక్తుల నుంచి ఆశ్రమం వ్యక్తులు ఈ డబ్బును వసూలు చేశారు. ఇందులో ప్రముఖులు కూడా ఉన్నారు.
పోలీసుల దర్యాప్తు:
ఈ ఉదంతం వెలుగుచూడటంతో సుధాకర్ మహరాజ్ గత నెల 15న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో మోసపోయిన బాధితులంతా న్యాయం కోసం నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సుధాకర్మహరాజ్తోపాటు ఇందులో భాగస్వామ్యమైన వాసవి, భాస్కర్, నారాయణరెడ్డి, యశ్వంత్ సింగ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆశ్రమం కార్యాలయంలో పనిచేసే సాయి, శ్రీనులను కూడా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ఆత్మహత్య డ్రామా:
ఆశ్రమంలో మోసాలు వెలుగు చూడడంతో సుధాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించడంతో కేసు విచారణకు ఆటంకం ఏర్పడింది.
అయితే సుధాకర్ పురుగుల మందు తాగడం వట్టి డ్రామానే అన్న విమర్శలు ఉన్నాయి. ఆశ్రమంలోకి పురుగుల మందు డబ్బా ఎందుకొచ్చిందనేది తేలాల్సి ఉంది. కేసు నుంచి తప్పించుకునేందుకే సుధాకర్ ఈ డ్రామాకు తెరలేపాడాన్న వాదనలూ ఉన్నాయి.
తప్పించుకునే ప్రయత్నంలో..:
సింహపురి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్ను ఇటీవలే ఇంటెన్సీవ్ కేర్ నుంచి ప్రత్యేక గదిలోకి మార్చారు. అయితే గది వద్దే కాపలా ఉంటున్న సుధాకర్ అల్లుడు సంపత్ లోపలికి పోలీసులను సైతం అనుమతించడం లేదు. ఒకటి రెండు సార్లు పోలీసులు లోపలికి వెళ్లినప్పటికీ.. సుధాకర్ విచారణకు అంతగా సహకరించలేదు.
నీరుగారుస్తున్నారా?:
సుధాకర్కు నిజంగా వైద్యం అందిస్తున్నారా? లేక డ్రామాను రక్తి కట్టిస్తున్నారా? అన్న అనుమానాలు ఉన్నాయి. సుధాకర్ మెడికల్ రిపోర్టులను సైతం డాక్టర్లు గోప్యంగా ఉంచుతుండటం గమనార్హం.
ఒక రకంగా పోలీసులు, డాక్టర్లే ఈ కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే సుధాకర్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని కొంతమంది ఆరోపిస్తున్నారు.
ఆసుపత్రి నుంచే లాయర్లను సంప్రదిస్తూ కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాడని చెబుతున్నారు. కేసులో మరో ప్రధాన నిందితురాలైన వాసవి ఆచూకీ సైతం పోలీసులు ఇప్పటిదాకా కనుక్కోలేకపోవడం గమనార్హం.