ఇంగ్లీష్ మీడియం: వెనక్కి తగ్గని సుధీష్ రాంభొట్ల: ఈ సారి సుప్రీంకోర్టుకు: కొత్త జీవోపైనా రగడ
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్లొో విద్యా బోధన కొనసాగించే దిశగా అడుగులు వేస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఇప్పట్లో న్యాయపరమైన ఇబ్బందులు తప్పేలా లేవు. హైకోర్టు సూచించినట్లుగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించిన తరువాత.. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కోసం కొత్తగా జారీ చేసిన జీవో చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ సారి దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి.
రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో సంచలనం: హైకోర్టు జోక్యం..విచారణకు డెడ్లైన్: ఆరు నెలల్లోగా..
బలవంతంగా రుద్దే ప్రయత్నం..
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను ప్రారంభించడానికి వీలుగా జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ వేసిన సుధీష్ రాంభొట్ల ఈ సారి సుప్రీంకోర్టు మెట్లెక్కబోతున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధికార ప్రతినిధిగా పని చేస్తోన్న ఆయన ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తెలుగు భాష అంతర్థానమౌతుందనేది ఆయన అభిప్రాయం. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను జగన్ ప్రభుత్వం బలవంతంగా రుద్దే ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు..
ఈ కారణం మీదే ఆయన ఇదివరకు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పటి జీవోను హైకోర్టు నిలిపివేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాల మేరకు ముందడుగు వేయాలని సూచించింది. హైకోర్టు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం అభిప్రాయ సేకరణ చేపట్టింది. 96 శాతానికిపైగా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను కొనసాగించడానికి తమ అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
ఎస్సీఈఆర్టీ నిబంధనలకు అనుగుణంగా..
దీన్ని ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం.. కొత్తగా మరో జీవోను జారీ చేసింది. రాష్ట్రాల విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీఈఆర్టీ) నిబంధనలకు అనుగుణంగా కొత్త జీవోను విడుదల చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడానికి సన్నాహాలు చేపట్టింది. దీనికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను సైతం జారీ చేసింది.
కొత్త జీవోపైనా న్యాయపోరాటం..
ఈ కొత్త జీవోపైనా న్యాయపోరాటానికి సిద్ధపడుతున్నారు సుధీష్ రాంభొట్ల. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో చేపట్టిన అభిప్రాయ సేకరణలో నిజాలు కనుమరుగు అయ్యాయని ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో బలవంతంగా ఇంగ్లీష్ మీడియానికి అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పించారని విమర్శిస్తున్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెడతామని ప్రభుత్వం భయపెట్టిందని మండిపడుతున్నారు.
Recommended Video
మాతృభాషను ఎలా దూరం చేస్తారంటూ..
ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జగన్ సర్కార్ పరిపాలన సాగిస్తోందని సుధీష్ రాంభొట్ల విమర్శిస్తున్నారు. తెలుగుపై మమకారంతో తాను పోరాటం కొనసాగిస్తున్నానని, ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనను అడ్డుకోవడానికి న్యాయపరమైన అన్ని రకాల వనరులను వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ప్రాథమిక దశ నుంచే ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కొనసాగించడం వల్ల విద్యార్థులు తమ మాతృభాషకు దూరమౌతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.