జగన్ రెడ్డి గారూ థాంక్స్, సుగాలీ ప్రీతి కేసు సీబీఐకి అప్పగించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్
సుగాలీ ప్రీతి కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి అప్పగించడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. న్యాయం చేయాలని మూడేళ్లుగా ఎదురుచూస్తోన్న కుటుంబానికి కాస్త స్వాంతన చేకూరింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైందని.. కానీ సీబీఐ విచారణకు ఆదేశించడం మంచి పరిణామంగా పేర్కొన్నది. ఈ మేరకు బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాకు లేఖ విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ వెల్ కం..
సుగాలీ ప్రీతి కేసును సీబీఐ విచారణ చేపట్టి, నిందితులను వెంటనే గుర్తించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. పాఠశాలలో విద్యార్థినిపై లైంగికదాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రీతి ఘటనపై కర్నూలు వాసులు కూడా ఆందోళనకు దిగారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. దీంతోనే వైసీపీ ప్రభుత్వంలో కదలిక వచ్చిందని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. సుగాలీ ప్రీతి హత్య కేసుపై నిష్పక్షిపాత విచారణ కోసం పోరాడిన జనసేన నాయకులు, జన సైనికులకు, ప్రజాసంఘాలను పవన్ కల్యాణ్ అభినందించారు. నిందితులకు శిక్ష పడే వరకు తమ పోరాటం కొనసాగుతోందని పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు.
ఏం జరిగిందంటే..
కర్నూలుకి చెందిన సుగాలీ పార్వతి, రాజు నాయక్ కూతురు సుగాలీ ప్రీతి. ఆమె కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్ట్ 19వ తేదీన స్కూల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్కూల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పేరెంట్స్ మాత్రం ఆత్మహత్య చేసుకోలేదని లైంగికదాడి చేసి, హతమార్చారని ఆరోపించారు. వారు ఆరోపించినట్టు 2017 ఆగస్ట్ 20వ తేదీన పోస్టుమార్టం నివేదిక కూడా లైంగికదాడి జరిగినట్టు వచ్చింది. దీనిని పెథాలజీ హెచ్వోడీ కూడా ధృవీకరిస్తూ నివేదిక అందజేశారు.
పోక్సో, అట్రాసిటీ కేసులు..
బాలిక పేరెంట్స్ స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాని, అతని కుమారులపై కంప్లైంట్ చేశారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఘటనపై కలెక్టర్ ఐదుగురు సభ్యులతో కమిటీ వేయగా విద్యార్థినిపై లైంగికదాడి చేసి.. హత్య చేశారని కమిటీ నివేదిక అందజేసింది. కేసులో సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్ట్ చేశారు. అయితే రాజకీయ అండదండలతో వారు 23 రోజులకే బెయిల్ మీద బయటకొచ్చారు. దీంతో బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. ఆధారాలు ఉన్న ఎందుకు బెయిల్ ఇచ్చారని ప్రశ్నించారు. వారికి దళిత సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.
Recommended Video
పవన్కు విన్నవించడంతో..
కూతురికి జరిగిన అన్యాయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సుగాలీ పార్వతి విన్నవించారు. సుగాలీ ప్రీతికి న్యాయం చేయాలని ఈ నెల 12వ తేదీన కర్నూలులో పవన్ కల్యాణ్ ర్యాలీ తీశారు. పవన్ కల్యాణ్ డిమాండ్తో సుగాలీ ప్రీతి కేసుపై ఆందోళనలు మిన్నంటాయి. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ వచ్చింది. ఇటీవల కర్నూలులో సీఎం జగన్ పర్యటించిన సందర్భంగా సుగాలీ పార్వతి సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరగా.. అందుకు అంగీకరించిన జగన్, సీబీఐ చేత దర్యాప్తు చేయించేందుకు అంగీకరించామని పేర్కొన్నారు. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు. కేసును సీబీఐకి అప్పగించడం మంచి పరిణామమని పేర్కొన్నారు.