Sugali Preethi: పవన్ ర్యాలీకి ఒక్క రోజు ముందు: సుగాలి ప్రీతి కేసు సీబీఐకి: త్వరలో ఆ రెండు కూడా.. !
కర్నూలు: కర్నూలు జిల్లాల్లో మూడేళ్ల కిందట సంచలనం సృష్టించిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును జగన్ సర్కార్ సీబీఐకి అప్పగించిందా? త్వరలో మరో రెండు కేసులను కూడా సీబీఐకి అప్పగించడానికి ప్రతిపాదనలను సిద్ధం చేసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుగాలి ప్రీతి కేసును ఇదివరకే సీబీఐకి అప్పగించామని జిల్లా ఎస్పీ డాక్టర్ కే పకీరప్ప చెబుతున్నారు. దీనికిసంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించామని అన్నారు.
Recommended Video
పవన్ కల్యాణ్ ర్యాలీకి
పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన కర్నూలు జిల్లా పర్యటనకు ఒక్క రోజు ముందు జిల్లా ఎస్పీ ఈ ప్రకటన చేయడం అనుమానాలకు దారి తీస్తోందనే వాదనలు కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్ పర్యటన, సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను నిర్వహించడానికి సిద్ధపడుతున్న ప్రస్తుత తరుణంలో హడావుడిగా జిల్లా ఎస్పీ ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలు వేరుగా ఉన్నాయని అంటున్నారు.
అత్యాచారం.. ఆపై హత్యగా అనుమానాలు..
2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్లో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో..
తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని చెబుతున్నారు. అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇదివరకే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుగాలి ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేసినప్పటికీ.. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు. పాఠశాల తమ పార్టీకి చెందిన నాయకుడిదే కావడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి.
సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా..
తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరోసారి అదే డిమాండ్ లేవనెత్తుతున్నారు సుగాలి ప్రీతి కుటుంబీకులు. ఆ కుటుంబానికి పవన్ కల్యాణ్ అండగా నిల్చున్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆయన భారీ ర్యాలీని నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులు సన్నాహాలను పూర్తి చేశారు. ఈ ర్యాలీకి ఒక్క రోజు ముందే- జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
త్వరలో ఆ రెండు కేసులు కూడా..
కాగా- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇదివరకు విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసును కూడా సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెబుతున్నారు. వైఎస్ వివేకా హత్యోదంతంపై ఆయన కుమార్తె ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన నేపథ్యంలో.. ఈ కేసును సీబీఐకి అప్పగించ వచ్చని అంటున్నారు. కోడికత్తి కేసును కూడా సీబీఐకే అప్పగించాలని వైసీపీ నాయకులు పట్టుబడుతున్నారు. ఈ రెండింటినీ సీబీఐకు అప్పగించవచ్చని సమాచారం.