స్నేహితుడి చావుకు కారణమయ్యానని...మనస్థాపంతో యువకుడి ఆత్మహత్య
అనంతపురం: స్నేహితుడి చావుకు పరోక్షంగా తానే కారణమయ్యాననే మనస్థాపంతో మిత్రుడు చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే తాను ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి ఉదంతమిది.
కారణామేదైనా కొన్ని గంటల వ్యవధిలోనే ఎదిగొచ్చిన ఇద్దరు యువకులు ఇలా మృత్యువు పాలవడం రెండు కుటుంబాల్లో పెను విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే...అనంతపురం హౌసింగ్బోర్డుకు చెందిన జయశేఖర్, శకుంతలమ్మదంపతుల కుమారుడు ప్రశాంత్ (23), విశాఖపట్నంకు చెందిన కండక్టర్ హరిప్రసాద్ కుమారుడు హేమంత్ (23) ప్రాణ స్నేహితులు.
ఇటీవలే చదువు పూర్తయిన క్రమంలో హేమంత్ పీవీసీ పైపులు, డ్రిప్ పరికరాలకు సంబంధించిన బిజినెస్ చేయాలనుకున్నాడు. అనంతపురంలోని బళ్లారి రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఈ వ్యాపార కేంద్రం నెలకొల్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయమే చర్చించేందుకు శనివారం ఉదయం విశాఖ నుంచి అనంతపురం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులు మరికొంతమంది స్నేహితులతో కలసి అనంతపురంలో హేమంత్ నెలకొల్పాలనుకున్న వ్యాపార కేంద్రం సమీపంలోనే రాత్రికి పార్టీ చేసుకున్నారు.
ఆ తరువాత అర్ధరాత్రి దాటేంతవరకు పార్టీలో పాల్గొన్న వీరు ఆ తరువాత ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో ఆదివారం వేకువఝాము ఒకటిన్నర ఆ ప్రాంతంలో ద్విచక్రవాహనాలపై ఇంటికి తిరిగివస్తున్న క్రమంలో ప్రశాంత్ బైక్ ను వేగంగా నడుపుతూ పీటీసీ ఫ్లై ఓవర్ దగ్గర అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడటంతో మృత్యువాతన పడ్డాడు.
దీంతో తీవ్రంగా కలత చెందిన హేమంత్ తన బిజినెస్ ఆలోచన కారణంగానే అనంతపురం నగరానికి వచ్చి పార్టీ చేసుకొని స్నేహితుడి మరణానికి కారణమయ్యాననే అపరాధ భావనతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఆ తరువాత క్షణికావేశానికి లోనై కొద్దిగంటల వ్యవధిలోనే తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో రాజీవ్ కాలనీ సమీపంలో ఉన్న ట్రాక్ వద్దకు వెళ్లి రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
తొలుత గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించిన పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అయితే సోమవారం ఆధార్ కార్డ్ ఆధారంగా అది హేమంత్ మృతదేహంగా గుర్తించారు.ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు స్నేహితులు మరణం బారిన పడటంతో రెండు కుటుంబాల్లో తీరని శోకం నింపింది.