ఏపీ సచివాలయంలో కలకలం, అమరావతికి భారీ మెడికల్ ప్రాజెక్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఎల్ బ్లాకులో శుక్రవారం నాడు ఓ సూటుకేసు కలకలం రేగింది. ఎల్ ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండే ఫ్లోర్. సూటుకేసు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది.
సచివాలయానికి వచ్చిన ఓ మహిళ తన సూటుకేసును గది బయట ఉంచి లోపలకు వెళ్లిన సమయంలో అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది కంగారు పడి పోలీసులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. వారు సూటుకేసును తెరిచి చూడగా అందులో దుస్తులు మాత్రమే ఉన్నాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నారు.
అమరావతికి భారీ మెడికల్ ప్రాజెక్టు
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి మరో భారీ మెడికల్ హెల్త్ ప్రాజెక్టు వచ్చింది. వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అమృత యూనివర్సిటీ ముందుకొచ్చింది. విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో విశ్వవిద్యాలయ ప్రతినిధులు చర్చించారు.
విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 2,250 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కూడా చేపడతామని తెలిపింది. దాంతోపాటు రీసెర్చ్ అండ్ హెల్త్ కేర్ క్యాంపస్ నిర్మాణం చేయనుంది. రూ.2,500 కోట్లతో రాజధానిలో ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం కానుంది.
అనంతపురంలో అగ్ని ప్రమాదం
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం పాతబస్టాండు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. రూ.10 లక్షల దాకా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.
కాగా, కడప జిల్లా పాలకొండలో భర్త చేతిలో భార్య, కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. వారి మృతదేహాలను పోలీసులు శక్రవారం వెలికితీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, కొడుకుకు బిర్యానీలో విషం పెట్టి కలిపిన విషయం తెలిసిందే.