సుజనా, ఉమ తీవ్ర వ్యాఖ్యలు: మధ్యవర్తిగానే పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బిజెపితో సంబంధాలు బెడిసికొట్టేంత తీవ్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యలు ఉన్నాయి. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర నీటి పారదుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు మరింత ముందుకు వెళ్లి వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లు భావిస్తున్నారు. కేంద్రంతో గానీ బిజెపితో గానీ తెగదెంపులు చేసుకుంటే మరింత నష్టం వాటిల్లుతుందని, ఏ విధంగానైనా కేంద్రాన్ని ఒప్పించి పనులు చేయించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. తీవ్ర నిరసన వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు సంబంధాలను తెగదెంపులు చేసుకునే పరిస్థితిలో లేరని అంటున్నారు. ఈ స్థితిలో నరేంద్ర మోడీకి, చంద్రబాబుకు మధ్య మధ్యవర్తిత్వం నెరపడానికి పవన్ కళ్యాణ్ తెర మీదికి వచ్చినట్లు భావిస్తున్నారు.
ప్రస్తుత నిరాశజనకమైన స్థితిలో ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందని, ఎంతో ఆశతో ప్రజలు టిడిపి-బిజెపి కూటమికి ఓటేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బిజెపి వదిలేయదని తాను భావిస్తున్నానని పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ తర్వాత అన్నారు. తెలుగుదేశం, బిజెపిల మధ్య సయోధ్యకు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసే అవకాశం ఉంది. అదే సమయంలో భూసేకరణ విషయంలో రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారని కూడా అంటున్నారు. అయితే, ఎపికి బడ్జెట్ కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మండిపడుతోంది.
గోదావరి నదిపై తలపెట్టిన పోలవరం ప్రాజెక్టుకు కేవలం రూ. 100 కోట్లు కేటాయించడంపై చంద్రబాబుతో సహా టిడిపి ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు పోలవరం ప్రాజెక్టుకు 18 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సి ఉండగా, కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం జోక్ అని ఎపి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. ఇలా అయితే ప్రాజెక్టు పూర్తి కావడానికి 400 ఏళ్లు పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేటాయింపులను సవరించకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం తాము కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకోవడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. దేవినేని ఉమా మహేశ్వర రావు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. చంద్రబాబుకు తెలియకుండా దేవినేని ఉమామహేశ్వర రావు ఆ వ్యాఖ్యలు చేస్తారని అనుకోవడానికి లేదు.
ఈ నేపథ్యంలోనే కేంద్ర శాస్త్ర, సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతి రాజుతో పాటు ఆయన టిడిపి నుంచి మోడీ మంత్రివర్గంలో ఉన్నారు. తాము అధికారాన్ని పట్టుకుని వేలాడడానికి సిద్ధంగా లేమని, తమ నేత చంద్రబాబు నాయుడు తగిన నిర్ణయం తీసుకుంటారని సుజనా చౌదరి అన్నారు. సుజనా చౌదరి కూడా చంద్రబాబు విధేయుల్లో అత్యంత ప్రధానమైన నాయకుడు.
కేంద్ర బడ్జెట్ను జాతీయ దృక్కోణంలో చూడాల్సి ఉంటుందని, ప్రధాని, ఆర్థిక మంత్రి అంచనాల మేరకు బడ్జెట్ రూపకల్పన జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే చంద్రబాబు ప్రధానితోనూ ఆర్థిక మంత్రితోనూ మాట్లాడాలని ఆయన ఆదివారంనాడు హైదరాబాదులో అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీలో నెలకొన్న ఆగ్రహాన్ని ఆయన ఆ విధంగా కొంత చల్లార్చడానికి ప్రయత్నించారు. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని అంటున్నారు..