కర్నాటకలో బీజేపీ ఓడిపోవాలని నేనెందుకు చెప్తా!: సుజన షాకింగ్, టీడీపీని వీడటంపై..
అమరావతి: తాను బీజేపీలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలను కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలన్నీ వట్టి ప్రచారమే అన్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్న తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే తీసుకుంటానని చెప్పారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట తప్పినందున ఎన్డీయే నుంచి బయటకు వద్దామని తాను గత జనవరిలోనే అధినేతకు చెప్పానని అన్నారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఏఫీ అవసరాలను తీర్చేందుకు ఎంతో కృషి చేశానని చెప్పారు.
బీజేపీలోకి సుజనా చౌదరి వెళ్తారని ప్రచారం, తిరుపతి సభలో ఇలా..: అసలేం జరిగింది!?
బీజేపీలో చేరుతాననడం హాస్యాస్పదం
నేను బీజేపీలో చేరుతున్నాననే ప్రచారం చాలా హాస్యాస్పదంగా ఉందని సుజనా చౌదరి అన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇది ప్రతిపక్ష పార్టీ వారు చేస్తున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. కేంద్రం నుంచి బయటకు రావడం తనకు ఇష్టం లేదనే మాటలో వాస్తవం లేదన్నారు. ఏపీకి న్యాయం జరగనప్పుడు కేంద్రం నుంచి బయటకు వద్దామని తాను జనవరి నుంచి చెబుతున్నానని అన్నారు. తర్వాత ఎన్డీయేలో ఉండి ఏపీ ప్రయోజనాల కోసం ఒత్తిడి పెంచుదామని చంద్రబాబుతో చెప్పానని అన్నారు.
కేంద్రమంత్రిగా అందరిని కలవాలి
నేను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో ఎక్కువగా అందరు బీజేపీ నేతలతో తిరగాల్సి వచ్చిందని, దానిని నెగిటివ్గా చూడవద్దని సుజన అన్నారు. అయినంత మాత్రాన బీజేపీలో చేరుతానని భావించడం సరికాదన్నారు. నేను మంత్రిమండలిలో ఉన్నప్పుడు ప్రధాని మోడీ నుంచి రాజ్నాథ్, అరుణ్ జైట్లీ సహా అందరినీ కలవాల్సి ఉంటుందన్నారు. అందుకే కలిశానని చెప్పారు. కేంద్రంలో నుండి మేం చాలా సాధించామని, ఇంకా సాధించాల్సినవి ఉన్నాయన్నారు.
నాపై సీబీఐ కేసులు లేవు
నాపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉంటే కదా నన్ను ఎవరైనా బెదిరించడానికి అని సుజనా అన్నారు. వైసీపీ నేతలకు ఆ కేసులు ఉన్నాయి కాబట్టే ప్రతి శుక్రవారం వెళ్తున్నారని విమర్శించారు. నేను క్విడ్ ప్రోకో వ్యాపారాలు చేయలేదన్నారు. వైసీపీ నాయకులు తనపై చేసే విమర్శలకు నేను స్పందించనని చెప్పారు. బ్యాంకుల నుంచి లోన్లు తీసుకోవడంపై స్పందిస్తూ.. ఆర్థిక నేరాలు వేరు, ఆర్థిక ఇబ్బందులు వేరు అన్నారు.
ఏపీలో బీజేపీ ఎక్కడ ఉంది?
ఏపీలో బీజేపీ ఎక్కడ ఉందని సుజన అన్నారు. కేంద్రం చేయాల్సినవి చేయలేదన్నారు. తనది ఎప్పుడు పార్టీ సిద్ధాంతం, చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామన్నారు. తాను పార్టీ నిర్ణయం ప్రకారమే నడుచుకుంటానని చెప్పారు. బీజేపీతో కలిసి ఉంటే ఏపీకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు భావించి అప్పుడు కలిశారన్నారు. హోదా విషయంలో ప్రజల ఆవేదనను తాము నిరసనలతో తెలియజేస్తున్నామన్నారు.
కర్నాటకలో హంగ్ రావొచ్చు
ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలని ఫండమెంటల్గా మేం ఎప్పుడూ అనలేదని సుజన అన్నారు. ప్యాకేజీకి తాము అసెంబ్లీలో తీర్మానం చేసింది నిజమేనని, కానీ దానిని ఇప్పటి వరకు అమలు పరచలేదన్నారు. పార్టీలు వస్తాయి పోతాయని, ప్రభుత్వం శాశ్వతం అన్నారు. ఏపీకి బీజేపీ చేసిన నష్టంపై కర్నాటక ఎన్నికల్లో ప్రభావం ఉంటుందా ఉండదా అనేది ముందు ముందు తేలుతుందన్నారు. కర్నాటకలో హంగ్ రావొచ్చన్నారు. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతారని అభిప్రాయపడ్డారు.
కర్నాటకలో బీజేపీ ఓడిపోతే బెట్టర్ అని నేనెందుకు అంటాను
కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతేనే బాగుంటుందని తెలుగుదేశం అనుకుంటుందా అని ప్రశ్నించగా.. సుజన స్పందిస్తూ.. లేదని, కర్నాటకలో బీజేపీ ఓడిపోతే బెట్టర్ అని చెప్పేందుకు నేను ఎవరిని అని, కర్నాటకకు ఏది మంచిదో దానిని అక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పారు. నేను కర్నాటకలో ఓటర్ను కాదని, బీజేపీ నేతను కాదని, కర్నాటక నుంచి ఎంపీని కాదన్నారు. టీడీపీ పోటీ చేస్తే గెలవాలని కోరుకుంటున్నానని, కర్నాటకలో మేం పోటీ చేయం కదా అన్నారు. అయితే చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంతా బీజేపీని ఓడించాలని పిలుపునివ్వగా సుజనా.. నేనెవరిని అలా చెప్పేందుకని షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం.