ఈడీ ఎదుట హాజరైన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి, 5 గంటల పాటు విచారణ
చెన్నై/విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి సోమవారం చెన్నైలో ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ఎదుట హాజరయ్యారు. బ్యాంకులకూ రూ.5700 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఆయనను ఈడీ అధికారులు దాదాపు ఐదు గంటల పాటు విచారించారు. కేసుకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులు ప్రశ్నించారు.
ఇటీవల బ్యాంకుల ఫిర్యాదు నేపథ్యంలో సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 120కి పైగా కంపెనీలు ఉన్నట్లుగా గుర్తించారు.
బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలు బాకీపడి, వాటిని తీర్చడం లేదని సుజనా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోదాల అనంతరం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది.
ఈ సమన్లను రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను కొట్టివేసింది. డిసెంబర్ 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని కోర్టు ఆదేశించింది. దీంతో సుజనా చౌదరి ఈ రోజు (డిసెంబర్ 3) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.