అవి అధర్మ పోరాటాలు.. వద్దని చెప్పినా చంద్రబాబు వినలేదని సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు ..!!
విజయవాడ/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ విమర్శలు గుప్పించారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి విజయవాడ వచ్చిన ఆయన ఆదివారం పార్టీ ఆత్మీయ సమావేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ..'కేంద్ర ప్రభుత్వం విషయంలో టీడీపీ చేసింది ధర్మ పోరాటాలు కాదు. అది అధర్మ పోరాటం. ధర్మపోరాట దీక్షలపై చంద్రబాబు నాయుడుకు వద్దని చెప్పినా వినలేదు.
కొందరు నేతల మాటలు విని అధర్మ పోరాట దీక్షలు చేశారు. పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి కట్టుబడి ఆనాడు బహిరంగంగా మాట్లాడలేకపోయాను. ఇప్పటివరకూ పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను. బీజేపీలో చేరాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాను. ప్రపంచ దేశాల ముందు దేహీ అనే ప్రధానులే ఉన్నారు కానీ భారతదేశం గొప్పతనాన్ని చాటింది ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ నిర్ణయాలు ఏపీ అభివృద్ధి వైపే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయం అవ్వాలనే నేను భారతీయ జనతా పార్టీలో చేరాను.'అని చెప్పుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి ఈరోజు ఏపీకి వచ్చారు. గుంటూరులోని అమరావతిలో ఈరోజు బీజేపీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో సుజనా మాట్లాడారు. బీజేపీలో చేరకముందు తాను పరోక్ష రాజకీయాల్లోనే ఉన్నానని తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరారని చెప్పారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా సారథ్యంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ప్రాధాన్యత పెరిగిందన్నారు.
2014 ఎన్నికల ముందు టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదర్చడంలో తాను కీలక పాత్ర పోషించానని సుజనా చౌదరి తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ధర్మపోరాటాల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. ఈ విషయంలో తాను గొంతు విప్పి చాలా స్పష్టంగా చెప్పానని అన్నారు.