చంద్రబాబుకే కాదు రాష్ట్రానికీ ఈ దుస్థితి ... ఆ దుర్దినం వల్లే అన్న ఎంపీ సుజనాచౌదరి
తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరి టీడీపీ ఓటమికి గల కారణాలను, చంద్రబాబు చేసిన తప్పులను ఏకరువు పెట్టారు. పార్టీని వీడిన నెల రోజుల తర్వాత టీడీపీని తానెందుకు వీడిందీ ఆయన చెప్పుకొచ్చారు. అలాగే, రాష్ట్రంలో టీడీపీ ఓటమికి గల కారణాలను కూడా విశ్లేషించారు ఎంపీ సుజనా చౌదరి. మోడీతో విబెధమే చంద్రబాబు కొంప ముంచిందని సుజనా పేర్కొన్నారు.
Recommended Video
బాబు చేసిన ఆ ఒక్క తప్పిదం వల్లే జగన్ అధికారంలోకి వచ్చారన్న సుజనా చౌదరి
బీజేపీతో చంద్రబాబు తెగతెంపులు చేసుకోవడం వల్లే ఏపీలో టీడీపీ ఓడిందన్నారు. బీజేపీతో కలిసి ఉంటే చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేవారని రాజ్య సభ సభ్యుడు సుజనా పేర్కొన్నారు. బీజేపీతో తగవు పెట్టుకుని బాబు చేసిన ఆ ఒక్క తప్పిదం వల్లే జగన్ అధికారంలోకి రాగలిగారని సుజానా చౌదరి అన్నారు. బీజేపీతో చంద్రబాబు కటీఫ్ చెప్పిన 8 మార్చి 2018ని ఏపీ చరిత్రలోనే దురదృష్టకరమైన రోజుగా తాను భావిస్తానని పేర్కొన్నారు. మూడున్నరేళ్లు ప్రధాని మోడీ దగ్గర పనిచేశానని, ఎన్డీయే నుంచి బయటకు రావొద్దని బాబుకు చెప్పానని సుజనా తెలిపారు. కానీ బాబు వినలేదని తొందరపాటు నిర్ణయం వల్లే బాబు ఇప్పుడు ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని సుజనా పేర్కొన్నారు.
టీడీపీ-బీజేపీ కలిసి ఏపీ కోసం చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని సుజనా ఆవేదన
బీజేపీతో ఘర్షణ వైఖరి వల్లే ఏపీ విభజన చట్టం అమలు కాలేదని ఆయన గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని కొన్ని కారణాల వల్ల తీసుకోలేకపోయామని సుజనా ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ విషయంలో చంద్రబాబు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల నాలుగేళ్లపాటు అభివృద్ధి కోసం టీడీపీ-బీజేపీ కలిసి చేసిన కృషి అంతా గంగలో కలిసిపోయిందన్నారు. ఇప్పుడు తమ ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు సుజనా చౌదరి . రాష్ట్రం తిరోగమనం దిశగా వెళ్తోందని ఆయన బాధ పడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంకు, ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడుల బ్యాంకు కూడా వైదొలిగాయని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సుజనా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీతో ఘర్షణ బాబు కొంప ముంచిందన్న సుజనా చౌదరి
ఇంతటి అనర్ధానికి కారణం చంద్రబాబు నాడు బీజేపీ విషయంలో తీసుకున్న నిర్ణయమే అని సుజనా చౌదరి అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు కదా అన్న భావనను ఆయన వెలిబుచ్చారు . ఆ నాడు చంద్రబాబు ఆ తప్పు చెయ్యకుంటే జగన్ అధికారంలోకి వచ్చే వారు కాదని సుజనా పేర్కొన్నారు. చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పోరాటం చెయ్యటం ఆయనకు ప్రజల మద్దతును కూడగట్టలేదని, ప్రజలు పంచాయితీలతో రాష్ట్ర ప్రయోజనాలు సాధించటం సాధ్యం కాదనే భావనతోనే టీడీపీని ఓడించారని సుజనా తన అభిప్రాయం చెప్పారు.