జగన్ ను బీజేపీ వదిలిపెట్టదా ..? సుజనా చౌదరి వ్యాఖ్యల ఉద్దేశం అదేనా ?
ఏపీ సీఎం జగన్ ను బీజేపీ టార్గెట్ చేస్తోందా ? ప్రస్తుత ఏపీ లో బీజేపీ నేతలు వైసిపి పాలనపై చేస్తున్న వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయా ? అంటే అవుననే చెప్పాలి. ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ సీఎం జగన్ టార్గెట్ గా బీజేపీ పావులు కదుపుతోంది అనే అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి.
వైసీపీ పాలనపై నిప్పులు చెరిగిన సుజనా చౌదరి ..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్లు పారిపోతున్నారని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై సుజనా చౌదరి విరుచుకుపడ్డారు. అంతేకాదు పరిశ్రమల్లో స్థానికులకే 75శాతం ఉద్యోగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుజనా చౌదరి తీవ్రంగా తప్పుబట్టారు. ఇదే తరహా నిర్ణయం అన్ని రాష్ట్రాల్లో తీసుకుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిర్ణయం రాజ్యాంగవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఇక బీజేపీ అధినాయత్వం కూడా జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అలాంటి భావనతోనే ఉంది. ఇక స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఇన్వెస్టర్లు తమకు కావలసిన నైపుణ్యం లేని వారికి ఉద్యోగాలు ఇవ్వలేక, కంపెనీలు పెట్టలేక ఇబ్బందిపడుతున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను గమనిస్తున్న కేంద్రం అంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీ సుజనా చౌదరి
ఇప్పటికే కేంద్ర సర్కార్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దృష్టి సారించిందని ఆయన వ్యాఖ్యానించారు.అంతేకాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు వైసిపి పాలనంతా గందరగోళంగా ఉందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని సుజనాచౌదరి ఆరోపించారు. అమరావతి నిర్మాణం విషయంలో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేయడానికి వైసిపి సర్కార్ తీరే కారణమని విమర్శలు గుప్పించారు. ఇక ఏపీలో ఇసుక కొరత సృష్టించారని , దీంతో నిర్మాణ రంగం కుదేలైంది అని సుజనా చౌదరి మండిపడ్డారు. ఇక పోలవరం నిర్మాణం విషయంలో టెండర్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొందరపాటు నిర్ణయం అని బిజెపి ఎంపీ సుజనా చౌదరి పేర్కొన్నారు. పోలవరం నిర్మాణంలో కాంట్రాక్టర్ ఎవరన్న విషయం ముఖ్యమైనది కాదని, నిర్మాణం ఎలా చేస్తున్నారు ఎంత సమయంలో పూర్తి చేస్తున్నారు అన్నదే ముఖ్యమైన విషయమని, దానిని పక్కన పెట్టి కాంట్రాక్టర్ ఎవరన్న దానిపై దృష్టి సారించడం, వారి టెండర్లను రద్దు చేయడం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం పనులు ఆగకుండా చర్య తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేసి కూర్చోడం దారుణమని మండిపడ్డారు. ఇక దీనిపై కేంద్రం కూడా ఆలోచిస్తోందని మరో వారం రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని సుజనాచౌదరి పేర్కొన్నారు.
జగన్ టార్గెట్ గా బీజేపీ విమర్శలు ... భవిష్యత్ లో జగన్ సర్కార్ కు చుక్కలేనా ?
గత ప్రభుత్వంలో కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు ఆలస్యమైందని చెప్పిన సుజనాచౌదరిఇప్పుడు మళ్లీ అంతరాయం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఇక తాజా వ్యాఖ్యలతో జగన్ విషయంలో టీడీపీ ఏమో కానీ బిజెపి మాత్రం గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది. పైకి కేంద్రంలో బిజెపి, వైసీపీ కలిసి ఉన్నట్లుగా కనిపిస్తున్నా, రాష్ట్రంలో మాత్రం బిజెపి వైసీపీని టార్గెట్ చేస్తుంది. ఒక్కొక్కరుగా నాయకులు జగన్ సర్కారు తీరుపై, జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసిపి పాలన అరాచక పాలన అంటూ, వైయస్సార్ కు జగన్ కు ఏమాత్రం పోలిక లేదంటూ మండిపడుతున్నారు. వైయస్సార్ అన్నం పెడితే జగన్ కడుపు కొడుతున్నాడని నిప్పులు చెరుగుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని మూడు నెలలు కూడా కాకముందే ఇంతలా బీజేపి ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం, విమర్శలకు దిగడం చూస్తుంటే భవిష్యత్తులో బిజెపి జగన్ ను గట్టిగానే టార్గెట్ చేస్తుంది అన్న సంకేతాలు ఇస్తున్నాయి.