అంత మాటంటావా.. బాధపడ్డా, భార్యాపిల్లలున్నారుగా, సారీ చెప్పు: విజయసాయిపై సుజన
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు బాధించాయని, ఆయన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంగళవారం డిమాండ్ చేశారు. ఆయన ఇతర ఎంపీలతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబూ! మాల్యాతో పోలుస్తావా, అమ్మానాన్నకు పుడితే: విజయసాయి సంచలన వ్యాఖ్యలు
బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం అదేం తప్పు కాదని సుజన చెప్పారు. ఆయన కూడా ఆడిటర్ అని, తెలిసి ఉంటాయన్నారు. ఆర్థిక నేరాలకు, తాను బ్యాంకు నుంచి అప్పు తీసుకోవడానికి చాలా తేడా ఉందన్నారు. విజయ సాయి రెడ్డి తనపై చేసిన విమర్శలతో కాసేపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదన్నారు.
విజయసాయి సభ్య సమాజంలో ఉన్నాడా?
అసలు విజయసాయి రెడ్డి సభ్య సమాజంలో ఉంటున్నాడా లేదా అని సుజన ప్రశ్నించారు. ఇలాంటి వారు సభలో ఉండటం మన ఖర్మ అన్నారు. ఇలాంటి వారికి ప్రజలు గట్టి బుద్ది చెబుతారన్నారు. ఆర్థిక నేరాలకు, ఆర్థిక ఇబ్బందులకు చాలా తేడా ఉందన్నారు. తాను ఎవరికీ ఒక్క రూపాయి అప్పులేనని చెప్పారు.
విజయసాయి వెంటనే క్షమాపణ చెప్పాలి
అప్పు తీసుకోకుండా మనం సంస్థలు నడపగలమా అని సుజనా ప్రశ్నించారు. అప్పు తీసుకోకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వగలమా అని నిలదీశారు. తాను 35 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని చెప్పారు. తనపై చేసిన వ్యాఖ్యలకు విజయ సాయి రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
విజయసాయి వ్యాఖ్యలు బాధించాయి
విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు చాలా బాధాకరం అని సుజన అన్నారు. ఆయన మాటలు చూస్తుంటే ఆయనకు ఏమో అయినట్లుగా ఉందన్నారు. అలాగే, సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కూడా సరికాదన్నారు. కరిచే కుక్క అరవదు అన్నట్లుగా అంటూ ఓ సందర్భంలో సామెత కూడా చెప్పారు.
వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, భార్యాపిల్లలు ఉన్నారుగా
ఆయన వెంటనే క్షమాపణ చెప్పాల్సిందేనని సుజన చెప్పారు. తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎవరు అప్పు ఉచ్చినా కట్టకుంటే చట్ట ప్రకారం ముందుకు వెళ్తారన్నారు. కానీ తమపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఎలాగన్నారు. విజయసాయి వాడిన పదజాలం సరికాదన్నారు. యావత్ ఏపీ తలదించుకునేలా మాట్లాడారన్నారు. భావితరాలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. విజయసాయి రెడ్డికీ భార్యాపిల్లలు ఉన్నారని, వారు చూసేవిధంగా మాట్లాడారా అన్నారు. ఇలా ఉంటే రాజకీయాలు ఎక్కడకు వెళ్తున్నాయనే విషయాన్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలైనా ఉండవచ్చునని, పార్లమెంటులోకి అడుగుపెట్టవచ్చునని, కానీ పార్లమెంటు పరువుతీసేలా వ్యవహరించవద్దన్నారు. ఆయన తప్పుడు భాష మాట్లాడినందున, దానిని తెలుసుకొని మీడియా ద్వారా క్షమాపణ చెబితే మంచిదన్నారు.
మోడీని కలవడంపై సుజన
ప్రధాని నరేంద్ర మోడీని తనకంటే ముందే సుజనా చౌదరి కలిశారన్న విజయసాయి వ్యాఖ్యలపై కూడా సుజన స్పందించారు. తాను అందరి ముందే వెళ్లి కలిశానని చెప్పారు. ప్రస్తుతానికి తమ అజెండా ప్రత్యేక హోదా అన్నారు. ఇతర అంశాల్లో వేలుపెట్టబోమన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని సహించం
మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. విజయసాయి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. హుందాతనం కోల్పోయేలా విజయసాయి రెడ్డి మాట్లాడారన్నారు. చంద్రబాబును ఉద్దేశించి ఆవిధంగా మాట్లాడటం అంటే ఏపీ ప్రజలను అవమానించినట్లే అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాళ్లను సహించమన్నారు. కేంద్రంపై వైసీపీ అవిశ్వాసం పెడితే మద్దతిస్తామని అసెంబ్లీలో చంద్రబాబు చెప్పారన్నారు. రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో, ఎవరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ తెలుసునని చెప్పారు. వైసీపీ అజెండా ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదన్నారు.