విజయసాయి చౌకబారు రాజకీయాలు మానుకో, వారం వారం కోర్టు మెట్లు ఎక్కుతూ, రాష్ట్రపతికి లేఖపై సుజనా
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై బీజేపీ ఎంపీ సుజనాచౌదరి స్పందించారు. విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రపతికి ఎవరు లేఖ రాసినా హోంశాఖకు పంపిస్తారని గుర్తుచేశారు. అర్జీ పెట్టుకున్నా పంపించడం సాధారణమని చెప్పారు. విజయసాయిరెడ్డి రాసిన లేఖతో తన ప్రతిష్టకు భంగం కలుగజేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
తెరిచిన పుస్తకం
తన వ్యాపార, రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని సుజనాచౌదరి పేర్కొన్నారు. తనపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. వారం వారం కోర్టు మెట్లు ఎక్కే విజయసాయిరెడ్డి చౌకబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తనలా అందరూ కోర్టుల చుట్టూ తిరుగుతారనుకొన్నారా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి ఆర్థిక నేరాలపై విచారణ జరపాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు విజయసాయిరెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
లేఖ
సుజనాచౌదరిపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ స్పందించారు. సుజనా చౌదరి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రాసిన లేఖను కేంద్ర హోంమంత్రి వద్దకు పంపించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా కలకలం రేగింది. దీనిపై సుజనా చౌదరి స్పందించారు.
స్పందించిన హోంశాఖ
యలమంచిలి సుజనాచౌదరి ఆర్థిక నేరాలపై విచారించాలని విజయసాయిరెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు. అందులో అక్రమ కంపెనీలు నెలకొల్పారని, మనీ ల్యాండరింగ్ చేశారని, ఇంటర్నేషనల్ స్కానర్ అని పేర్కొన్నారు. సుజనాచౌదరి అక్రమ వ్యవహారాలపై ఈడీ, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. దీనిపై భారత రాష్ట్రపతి కార్యాలయ కార్యదర్శి అలోక్ కుమార్ పాల్ స్పందించారు. విజయసాయిరెడ్డి లేఖను ప్రస్తావిస్తూ హోంమంత్రిత్వ శాఖకు పంపించారు.
బీజేపీలో సుజనాచౌదరి
సుజనా చౌదరి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. బీజేపీ చీఫ్ అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. తమ ఎంపీపై రాష్ట్రపతి భవన్ స్పందించడంపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారనే చర్చకు దారితీసింది. తమ ఎంపీపై కూడా విచారణ జరిపితే.. సుజనా చౌదరి ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాయం.