రాజుగారు మారినప్పుడల్లా..! కేంద్రం దృష్టికి ‘రాజధాని’: జగన్ సర్కారుపై సుజనా చౌదరి ఫైర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల అంశంపై అనుకూల, ప్రతికూల వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంతోపాటు అధికార పక్షంలోనూ మూడు రాజధానుల అంశంపై మిశ్రమ స్పందన వస్తుండటం గమనార్హం. టీడీపీ నేతలు కొందరు ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం గమనార్హం. ఇదే పరిస్థితి అన్ని పార్టీల్లోనూ ఉంది.
చంద్రబాబు రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు... అందుకే రాజధాని మూడు ముక్కలాటగా మారింది.. నారాయణ
రాజధాని మార్పు అంత తేలిక కాదు..
సార్వత్రిక ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనా చౌదరి మూడు రాజధానుల అంశంపై తీవ్రంగా స్పందించారు. మూడు రాజధానుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కేంద్ర చూస్తూ ఊరుకోదని అన్నారు. తగిన సమయంలో చర్యలుంటాయన్నారు. రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని అన్నారు.
జీఎన్ రావు కమిటీపై అనుమానాలు..
జీఎన్ రావు కమిటీ నివేదికపైనా అనుమానలున్నాయని సుజనా చౌదరి తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్న ఆయన.. రాజధానులు మార్చడం సరికాదని అన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుజనా కీలక విషయాలను ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా రాజధాని మార్చడం సరికాదని అన్నారు.
రాజుగారు మారినప్పుడప్పుల్లా..
ఎన్నికల తర్వాత పరిపాలనపై దృష్టి పెట్టాల్సింది పోయి వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యత ఇస్తున్నారని వైఎస్ జగన్ సర్కారుపై సుజనా మండిపడ్డారు. రాజుగారు మారినప్పుడల్లా రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదని అన్నారు. అసలు కమిటీ ఏం నివేదిక ఇచ్చిందన్నది కూడా ఎవరికీ తెలియడం లేదని అన్నారు. అంతేగాక, కమిటీ ఎక్కడ పర్యటించిందో కూడా తెలియడం లేదని అన్నారు.
పరిపాలన కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి
అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటని సుజనా చౌదరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కాకుండా.. అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి సారించాలని జగన్ సర్కారుకు హితవు పలికారు. ప్రజాధనం వృథా చేస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తుంటే చూసూ ఊరుకునే పరిస్తితి లేదన్నారు.
కక్ష సాధింపు.. కేంద్ర దృష్టికి..
ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. కక్ష సాధింపు చర్య దిశగా ప్రభుత్వం వెళుతోందని ఆరోపించారు. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే సమస్యే ఉండదని సుజనా చౌదరి అన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రాజధాని అమరావతికి కేంద్రం నిధులు ఇచ్చిందని ఆయన తెలిపారు. త్వరలో రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చిస్తామని సుజనా చెప్పారు.