సుజనా ఓ అసత్యాల వీరుడు..! మండిపడుతున్న వైసీపి, టీడిపి నేతలు..!!
అమరావతి/హైదరాబాద్ : బీజేపి యేతర రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు మైండ్ గేమ్ కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారంలో లేని రాష్ట్రల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమకు అందుబాటులో ఉన్నారని అధికార పార్టీ ఆత్వ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో ఉన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యూహాన్నిపక్కాగా అమలు చేసేందుకు ప్రణాళిక రచించారు బీజేపి ఢిల్లీ పెద్దలు. స్ధానిక కీలక నేతలకు ఈ బాద్యతను అప్పగించి ఫలితాన్ని రాబట్టడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయాలన్నది బీజేపి లక్ష్యంగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏపి అధికార పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎపి సుజనా చౌందరి తనదైన శైలిలో ప్రస్తావించారు.
వల్లభనేని వంశీ తప్పటడుగు వెయ్యడు...నాకు టచ్ లో ఉన్నాడు: సుజనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపిలో వైసీపి, టీడిపి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న ఎంపీ.. సుజనా చౌదరి మైండ్ గేమ్ అంటున్న విపక్షాలు..
ఆంద్ర ప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన 20మంది ఎంపీలతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్లో ఉన్నారని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేసారు. అయితే వైసీపి పార్టీ నాయకులు కొందరు మాత్రం ఇందులో వాస్తవం లేదని కొట్టి పారేస్తున్నారు. . సుజనా చౌదరికి మతిలేక మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు. తమ ఎంపీలు ఎవరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా లేరని విలేఖరుల సమావేశం నిర్వహించి మరీ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వైయస్సార్ పార్టీకి చెందిన లోక్సభ సభ్యుడు రఘురామరాజు రెండు రోజుల క్రితం తాను పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడా పనిచేయలేదని, ప్రధానిని, కేంద్ర మంత్రులను కలవలేదని పార్టీ అధినేతకు వివరణ ఇచ్చుకున్నారు. అయితే నిప్పు లేనిదే పొగ రాదనే చర్చ జరుగుతోంది.
వైసీపి ఎంపీలపై సుజనా కామెంట్... 20మంది టచ్ లో ఉన్నారని స్పష్టీకరణ..
కాగా ఆ ఎంపీ జగన్ను కలిసి వివరణ ఇచ్చిన తర్వాత అంతా సద్దుమణిగింది అనుకున్న తరుణంలో మళ్లీ ఆయన వైయస్సార్ పార్టీ నాయకులకు షాక్ ఇచ్చారు. జగన్ ను సంప్రదించిన కొద్ది రోజులకే రఘురామరాజు బీజేపీ పార్లమెంటరీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అయితే, ఆయన ఎందుకు అక్కడకు వెళ్లారో, వివరణ ఇచ్చిన రెండు రోజులకే రఘురామరాజు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ఒక వాదనైతే, సుజనా చౌదరి చెప్పినట్టు బీజేపీతో టచ్లో ఉన్న వైయస్సార్ పార్టీ ఎంపీల్లో రఘురామరాజు కూడా ఉన్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఆయన పార్టీ మారే విషయం మాట్లాడేందుకే అక్కడకు వెళ్లారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సుజనా చౌదరి అసత్యాల వీరుడు.. అన్నీ అబద్దాలే అంటున్న టీడిపి నేతలు..
అంతే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారన్న సుజనాచౌదరి వ్యాఖ్యల్లో నిజం లేదని ఇది బీజేపీ, వైసీపీ మైండ్గేమ్ అని టీడీపీ శాసనసభ్యులు చెప్పుకొస్తున్నారు. గుంటూరులోని రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇదే అంశంపై తెలుగు తమ్ముళ్లు స్పష్టతనిచ్చారు. తనతో టచ్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సుజనా చౌదరి చెప్పాలని వారు డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడుపై తమకు పూర్తి నమ్మకం ఉందని, సుజనా చౌదరి ఇలాంటి అసత్యాలు ప్రచారం చేయకుండా, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవాటి కోసం కృషి చేయాలని హితవుపలికారు.
టీడిపి వైసీపి నేతల మండి పాటు.. సుజనా వాఖ్యలపై భగ్గుమంటున్న నేతలు..
టీడీపీని దెబ్బతీయటం ఎవరి సాధ్యం కాదన్నారు ఏపి టీడిపి ఎమ్మెల్యేలు. చంద్రబాబు వయసుపై అనేకమంది అపోహలు ప్రచారం చేస్తున్నారని, కానీ రాష్ట్రాన్ని పరిపాలించగల అర్హత, సత్తా చంద్రబాబుకు ఇంకా ఉందన్నారు. భవిష్యత్ తరాలకు చంద్రబాబు నాయుడు దిక్సూచీ అన్నారు. రాష్ట్ర విభజనాంతరం రెవిన్యూలోటులో కూడా, రాష్ట్రంలో రెండంకెల వృద్దిరేటు సాధించిన సమర్దుడు చంద్రబాబు అని తెలిపారు. ఈ అంశాలన్ని సుజనా చౌదరికి తెలిసి కూడా డ్రామాలాడుతున్నాడని టీడిపి నేతలు మండి పడుతున్నారు. టీడిపి నేతలతో పాటు బీజేపి నేతలు కూడా ఇటీవల సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు.