ప్రత్యేక హోదాతో పాటు అన్నీ సాధిస్తాం : సుజనా చౌదరి
న్యూఢిల్లీ : మిత్రపక్షానికి.. మిత్ర ధర్మానికి విరుద్దంగా వ్యవహరించమని.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందనే నమ్మకముందని బీజేపీ ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి. అలాగే ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష వైసీపీ, కాంగ్రెస్ లు డబుల్ గేమ్స్ ఆడుతున్నాయని.. టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా హోదా సాధించి తీరుతుందని తెలిపారు సుజనాచౌదరి.
ఏపీ అభివృద్దికి ప్రత్యేక హోదా ఒక్కటే చాలదన్న సుజనా చౌదరి.. బిల్లులో లేని అంశాలపై కూడా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ రాష్ట్రానికి సంబంధించిన పలు శాఖల నివేదికలు తెప్పించుకుని పరిశీలిస్తున్నారని చెప్పిన సుజనా.. రాజధాని నిధులు, పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నాబార్డ్ నిధులు, అలాగే వెనుకబడిని జిల్లాల అభివ్రుద్దికి సంబంధించిన విషయాలపై కడా కేంద్రంతో మంతనాలు జరుపుతున్నట్లుగా చెప్పుకొచ్చారు.
ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన సుజనా.. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు కేవలం స్వార్థపూరిత వ్యవహారితమేనని కొట్టిపారేశారు. కేవలం తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు ఎత్తుగడ వేశారని చెప్పుకొచ్చారు. ఇక మంగళవారం నాడు జరిగిన ఉభయ సభల్లో అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ నేతలు కనిపించకుండా పోయారని ఆరోపించారు సుజనా.
ప్రత్యేక హోదా సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉందన్న విషయం తమకు తెలుసని, తమ అధినేత చంద్రబాబు మార్గదర్శకాల మేరకు ప్రత్యేక హోదాపై తామంతా చిత్తశుద్దితో ప్రయత్నిస్తున్నామని తెలియజేశారు. ప్రత్యేక హోదాను ఏదో దయా దాక్షిణ్యాల పేరుతో అడగడం లేదని, అది ఏపీ ప్రజల హక్కు అని అన్నారు సుజనా.
ప్రత్యేక హోదాపై కేంద్రం సానుకూలంగానే ఉందని చెప్పుకొచ్చిన సుజనా.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై ఈరోజు సీఎం చంద్రబాబుతో చర్చించారన్నారు. హోదాపై కేంద్రం వైఖరిని మరికొంత కాలం వేచి చూస్తామని.. ఎట్టి పరిస్థితుల్లోను ప్రత్యేక హోదా సాధించి తీరడం ఖాయమని చెప్పారు సుజనా.
ధర్నాలు ఆందోళనలు చేయడం.. సభలను స్తంభింపజేయడం తమ పార్టీ ఎథిక్స్ కు విరుద్దమని, ప్రజాస్వామ్య పద్దతిలోనే తమ డిమాండ్లను కేంద్రం ముందుంచే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఇదే సమావేశంలో జీఎస్టీ బిల్లుపై కూడా స్పందించిన ఎంపీ సుజనా చౌదరి.. జీఎస్టీ బిల్లుకు పార్టీ బేషరతుగా మద్దతు తెలుపుతామని ప్రకటించారు.