ఢిల్లీలో గవర్నర్తో సుజనా భేటీ: కేంద్రం ఏం చేస్తుంది?
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చిన ఇరు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజానా చౌదరి కలిశారు. శబరి బ్లాకులో గురువారం సాయంత్రం గంట పాటు వారిద్దరి మధ్య భేటీ జరిగింది. భేటీ గురించి మాట్లాడడానికి సుజనా చౌదరి ఇష్టపడలేదు.
సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడనే విషయం తెలిసిందే. నోటకు ఓటు కేసు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వంటి విషయాలపై సుజనా చౌదరి గవర్నర్తో మాట్లాడినట్లు తెలుస్తోంది.
శుక్రవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలుస్తారు. రాజ్నాథ్ సింగ్కు ఉభయ రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 8 విషయంలో గానీ, ఓటుకు నోటు కేసులో గానీ జోక్యం చేసుకోవడానికి సిద్ధంగా లేదనే విషయం కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సదానంద గౌడ వ్యాఖ్యల ద్వారానే కాకుండా తెలంగాణ బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి మాటల ద్వారా కూడా అర్థమవుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కూడా గవర్నర్ కేంద్ర హోంశాఖకు వివరించే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసు ప్రగతిని కూడా ఆయన చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైదరాబాదులో శాంతిభద్రతల పరిస్తితిపై, ఓటుకు నోటు కేసు ముందుకు సాగే క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంభవించే పరిణామాలపై గవర్నర్ నుంచి తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు.