తెలుగుబీజేపీ ముసుగు తొలుగుతోందా..? చంద్రబాబుకు మద్దతుగా సుజనా
చంద్రబాబు అత్యంత సన్నిహితుడు పేరున్న రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చకు కారణమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ మీద విమర్శలు చేసిన సుజనా చౌదరి..చంద్రబాబు కు మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలసీ ఉందని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు.
టీడీపీలో సుదీర్ఘ కాలం కొనసాగి..బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఇప్పుడు సడన్ గా చంద్రబాబుకు మద్దతుగా నిలిచేలా చేసిన వ్యాఖ్యలతో కొద్ది రోజులుగా సాగుతున్న చర్చకు మరింత బలం చేకూరుతోంది. చంద్రబాబు ఆ నలుగురిని బీజేపీలోకి పంపారనే ప్రచారం ఉంది. ఇప్పుడు వారు ముసుగు తీసేసి చంద్రబాబు మీద తమ అభిమానం చాటుకుంటున్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
జీవీఎల్ అలా..సుజనా ఇలా
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కరకట్ట మీద చంద్రబాబు అక్రమ నిర్మాణంలో ఉండటాన్ని తప్పు బట్టారు. అక్కడ ఉంటూ ఆరోపణలు చేయటం సరి కాదని వ్యాఖ్యానించారు. అక్కడ ఉంటూ రాజకీయం చేయటం అమానుషం అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో టీడీపీ నుండి బీజేపీ లో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన ఇంకా చంద్రబాబు మీద అభిమానం వదులుకోలేకపోతున్నట్లు వ్యాఖ్యలు వస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ..అదే సమయంలో చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటం పైనే ఇప్పుడు చర్చ మొదలైంది. సీఎం జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎంపీ సుజనాచౌదరి ఆరోపించారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వైసీపీ పాలసీ ఉందని విమర్శించారు. అక్రమాలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వం జిమ్మిక్కులు చేస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలపరిచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాల మీద ఆరోపణలు చేయటం గురించి చర్చ లేదు. అయితే, వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ టీడీపీ నేతల వాయిస్ నే సుజనా చౌదరి కొనసాగించటం పైనే అనేకే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ముసుగు తీసేస్తున్నారా..
సుజనా చౌదరి తొలి నుండి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు..టీడీపీ కోసం అనేక రకాలు కష్ట..నష్టాలు ఎదుర్కొన్నారు. పార్టీలో దాదాపు చంద్రబాబు తరువాతి స్థానం ఆయనదే. అటువంటి సుజనా చౌదరి ఏపీలో టీడీపీ అధికారం కోల్పోగానే కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీతో దూరం అయిన కారణంగానే టీడీపీ ఓడిపోయిందంటూ వ్యాఖ్యానించారు. తాము చెప్పినా చంద్రబాబు వినలేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సుజనాతో పాటుగా మరో కీలక నేతగా వ్యవహరించిన సీఎం రమేష్ సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు. చంద్రబాబు కోటరీలో కీలకంగా వ్యవహరించిన ఈ ఇద్దరూ ఇప్పుడు బీజేపీలో చేరటం వెనుక చంద్రబాబు ప్రోద్భలం ఉందని వైసీపీ నేతలు అప్పట్లోనే ఆరోపించారు. వారు బీజేపీలో చేరిన రోజు విదేశాల్లో ఉన్న చంద్రబాబు కేవలం ఒక్క సారి మాత్రమే స్పందించారు. తరువాత చంద్రబాబుతో సహా పార్టీ నేతలు ఎవరూ వారి గురించి ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. ఇక, కేంద్ర ప్రవేశ పెట్టిన బిల్లుల విషయంలో రాజ్యసభలోని మిగిలిన ఇద్దరు టీడీపీ సభ్యులతో అనుకూలంగా ఓటు వేయించటంలో సీఎం రమేష్ సూచనల మేరకే వారు వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, ఇప్పుడు నేరుగా సుజనా చౌదరి బీజేపీ ఎంపీగా ఉంటూనే చంద్రబాబుకు మద్దతుగా చేసిన వ్యాఖ్యల వెనుక అసలు ముసుగు తీసేస్తున్నారనే చర్చ మొదలైంది.
టీడీపీని బీజేపీకి దగ్గర చేస్తారా..
తాజాగా వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి చేసిన ట్వీట్ ను ఇప్పుడు వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకే వారు బీజేపీలో చేరారని..టీడీపీని బీజేపీకి దగ్గర చేసే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయనేది వైసీపీ నేతల వాదన. కొంత కాలంగా బీజేపీ నేతలు సైతం నేరుగా ముఖ్యమంత్రి జగన్..వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో బీజేపీకి మరో సారి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోందా అనే సందేహం వ్యక్తం అవుతోంది. అయితే, బీజేపీ జాతీయ నేతలు మాత్రం చంద్రబాబు తో సఖ్యతకు అంత సుముఖంగా లేరనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో..రానున్న రోజుల్లో బీజేపీ..టీడీపీ బంధం ఏ రకంగా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.